మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాదాపు దశాబ్ద కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్నా, తన రీ ఎంట్రీతో అదిరిపోయే హిట్ కొట్టాడు. ఇక మెగాస్టార్ చిరు సోదరుడిగా తెరంగేట్రం చేసి చిరంజీవికి ఏమాత్రం తగ్గని స్టార్డమ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించీ అందరికి తెలిసిన విషయమే. ఈ ఇద్దరూ కలిసి ముల్టీస్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే అధ్బుతంగా ఉంది కదూ? ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే చిరు, పవన్ల కాంబినేషన్లో ఓ మెగా మల్టీస్టారర్ రూపు దిద్దుకోనుంది. ఇటీవల సుబ్బి రామిరెడ్డి ఆహ్వానం మేరకు తన మనవడి వివాహ వేడుకకి ఈ ఇద్దరు స్టార్లు హాజరు అవటం అందరికి తెలిసిన విషయమే.
ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ, సినీ నిర్మాత అయిన టి. సుబ్బరామి రెడ్డి నిర్మాణంలో ఈ ఇద్దరి కలయికతో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. టాలీవుడ్ అగ్రదర్శకులలో ఒకరైన త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని సుబ్బరామి రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే మెగాస్టార్, పవర్ స్టార్ కలిసి చేసే ఈ మెగా మల్టీస్టారర్ సినిమా నిజంగానే వస్తే బాక్సాఫీస్ రికార్డ్స్ అన్ని బద్దలవటం ఖాయం అని చెప్పవచ్చు.