ఖమ్మం జిల్లాకు చెందిన మూడవ తరగతి విద్యార్ధిని పి. లక్ష్మి శ్రీజ తన అద్భుత ప్రతిభా పాటవాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెప్పించి అరుదైన ఆదరణ పొందింది. ఖమ్మం జిల్లా కు చెందిన వేల్పుల లక్ష్మిశ్రీజ తన తల్లిదండ్రులు సుధారాణి, కిరణ్కుమార్లతో కలిసి ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ను కలిసింది… తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు నేపథ్యం, తెలంగాణ మంత్రులు, వారి శాఖలు తదితర అంశాలపై గుక్కతిప్పుకోకుండా విశేషాలన్ని చెప్పింది. కాకతీయ రాజుల కాలం నాటి స్వర్ణయుగం, శాతావాహనుల పాలన, నిజాం నవాబుల గొప్పతనం, స్వాతంత్ర్యనంతర పరిస్థితి, మొదటి ఎస్ఆర్సి, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1969 ఉద్యమం, కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమం, మంత్రుల బృందం ఏర్పాటు, పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్, తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ కేబినెట్, మంత్రుల శాఖలు తదితర విషయాలన్నింటిని చెప్పింది.
ఒక్కటేమిటి ఇలా అనేక విషయాలను ఓ చిన్నారి ధారాళంగా చెబుతుంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఎలాంటి భయం లేకుండా మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి సీఎం ముందు అనేక విషయాలను అనర్గళంగా చెప్పింది. ఆ పాప జ్ఞాపకశక్తి, మేధోసంపత్తికి ముగ్ధుడైన సీఎం తన సొంత ఖాతా నుంచి రూ.10 లక్షల పదహార్లు అందజేశారు. బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. ఏదైనా ఓ రోజు భోజనానికి వస్తానని పాప తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఎన్నో పోటీల్లో పాల్గొన్న లక్ష్మీశ్రీజ ఎన్నో పతకాలు సాధించింది. ప్రపంచ భౌగౌళిక వివరాలు, ఆయా దేశాల ప్రధానమంత్రుల పేర్లు, భారత ఆర్థిక వ్యవస్థ తీరు, భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు, జాతీయ బ్యాంకుల వివరాలు, యూనివర్సిటీలు, దేశంలోని వివిధ పార్టీలు, వాటి గుర్తులు ఈ చిన్నారికి అవలీలగా చెప్పేస్తుంది. తనకు ఐఏఎస్ కావాలనుందని, ఈ పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలో తనకు తెలుసని, కలెక్టర్గా ఖమ్మం జిల్లాకే పనిచేయాలని ఉందని ఏడాది క్రితమే వచ్చీరాని మాటలతో చెప్పడం విశేషం.