మనది కాపోతే కాశీ దాకా అని సామెత. ఆ పావురాలూ వాళ్ళవి కావు..వాటి ప్రాణాలపైనా వీరికి ఎలాంటి అధికారమూ లేదు..అయినా సరే, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కి స్వాగతం పలకటానికి పషిమా గోదావరి జిల్లా కొవ్వూరు లో ….అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అరాచకమిది. శాంతి కపోతాలను తారాజువ్వలకు కట్టి, వాటి మెడలో కాంగ్రెస్ జెండాలు బిగించి మరీ ఆ జువ్వలను వారు ఫైర్ చేశారు. దాంతో గాల్లోకి జువ్వలు ఎగిరిన తర్వాత, రెండు పావురాలు ప్రాణాలు కోల్పోయాయి. చాలా పావురాలు రెక్కలు తెగి, తీవ్రంగా గాయపడ్డాయి.
జరిగిన సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన జంతు హక్కుల, వన్య ప్రాణ హక్కుల సంరక్షణ సంఘాలు , జిల్లా తెలుగుదేశం శ్రేణులు బాధ్యులపై తక్షణ చర్యకు డిమాండ్ చేశాయి. కేసు రిజిస్టర్ట్ చేసిన పోలీసులు, ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి, ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన ఒక కార్యక్రమం లో పాల్గొనడం కోసం అక్కడికి వెళ్ళిన రఘువీరా రెడ్డి, జరిగిన సంఘటన గురించి తనకు ఏమీ తెలియదని చెప్పుకొచ్చారు. వారేదో బాణా సంచా కాల్చినట్టుగా తాను భావించినట్టు ఆయన చెప్పారు. ఇహ మీదట, ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తామని మాత్రం ఆయన హామీ ఇచ్చారు.