నిన్నటి వరకు టాలీవుడ్ కి సంబందించిన ఏ ఫంక్షన్ అయినా కేరాఫ్ హైదరాబాద్. టాలీవుడ్లో ఏ చిన్న సినిమాకు సంబంధించిన ఫంక్షన్ అయినా హైదరాబాద్లోనే జరిగేవి. అయితే ఇప్పుడు కొద్దికొద్దిగా సీన్ మారుతోంది. సినిమా ఇండస్ట్రీ నెమ్మదిగా ఆంధ్ర ప్రదేశ్ వైపు తన అడుగులు వేస్తోంది. ఇప్పటికే గోపీచంద్ హీరోగా నటించిన లౌక్యం, బన్నీ సన్నాఫ్ సత్యమూర్తి, కళ్యాణ్రామ్ పటాస్ సినిమాలకు సంబంధించిన విజయోత్సవ వేడుకలను విజయవాడలో నిర్వహించారు.మేము దూరం కాదు అని ఆంధ్రా ప్రజలకు చెప్పటానికే ఈ ప్రయత్నం చేసారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. యువరత్న నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమా ఆడియో ఫంక్షన్ ని ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో పెట్టుకున్నాడు. ఆయన 99వ చిత్రం డిక్టేటర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఏపీ రాజధాని అమరావతి ధ్యానబుద్ధుని సన్నిధిలో డిసెంబర్ 20న పాటలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీవాస్ సైతం ధృవీకరించారు. డిసెంబర్ 20న డిక్టేటర్ ఆడియో రిలీజ్ నిర్వహించేందుకు ఓ ప్రత్యేక బృందం ఆదివారం అమరావతిలో పర్యటించి అక్కడ ఎలా ఏర్పాట్లు చేయాలనే అంశంపై పరిశీలించింది.ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ గతం లో తాను చేసిన లౌక్యం ఆడియో ని విజయవాడలో రిలీజ్ చేసననీ,ఇప్పుడు కూడా అలానే ఆంధ్రప్రదేశ్ లోనే చేయాలని అనుకుంటున్నాననీ చెప్తున్నాడు.
డిక్టేటర్ చిత్రంలో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ క్యారెక్టర్ లో రతి అగ్నిహోత్రి నటిస్తోందని తెలుస్తోంది.రతి పోషిస్తున్న ఈ క్యారెక్టర్ ఇంచుమించు సోనియా గాంధీని పోలీ ఉంటుందట. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమాస్తుల వ్యవహరాన్ని కూడా ఈ సినిమాలో టచ్ చేస్తున్నారట. సో.. ఒకప్పడు తనతో రొమాన్స్ చేసిన హీరోయిన్ తోనే.. ఇప్పుడు పోరు సలపబోతున్నాడు ఈ డిక్టేటర్. ఈ సినిమా ద్వారా బాలయ్య తన కెరీర్లోనే అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇప్పటికి ఈ సినిమాకి ఊహించిన దానికంటే ఎక్కువే బిజినెస్ జరిగిందని సమాచారం. ఆంధ్రా, సీడెడ్ వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయని సమాచారం. ఆంధ్రలోనే ఈ సినిమా 18 కోట్లు బిజినెస్ చేయగా.. సీడెడ్లో 6 కోట్ల వరకూ బిజినెస్ చేసిందట. ఇది బాలయ్య కెరీర్లోనే ఎక్కువ బిజినెస్ జరగడం ఇదే మొదటిసారట. లెజెండ్, లయన్ సినిమాల తరువాత వస్తున్న సినిమా కావడంతో మంచి బిజినెస్ జరిగిందట.
ఏరోస్ ఇంటర్నే షల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష కథానాయికలుగా నటిస్తున్నారు. సన్న నడుము సుందరి ఇలియానా ప్రత్యేక గీతంల నర్తించనుంది. ఎస్ఎస్.థమన్ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి పక్కాగా రిలీజ్ కానుంది.