ఒక ఈజిప్టు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. దేశంలోని భార్యల్ని నమ్మలేమని, వారు భర్తలకు ద్రోహం చేస్తారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన తెమోర్ ఎల్ సోబ్కీకి కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. గత డిసెంబర్ నెలలో టీవీ టాక్ షోలో మహిళలను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఫేస్ బుక్ లో ఉన్న భార్యా భాదిత సంఘం అని అర్థం వచ్చే గ్రూప్ కి అడ్మిన్ గా పేరు ఘడించిన ఈయనని ఒక టీవీ చానెల్ చర్చకు ఆహ్వానించింది. ఓ ప్రముఖ టీవీ చానల్లో మాట్లాడుతూ సోబ్కీ.. ఈజిప్షియన్ వివాహిత మహిళలపై అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశాడు. ముప్పై శాతం ఈజిప్టు వివాహిత మహిళల్ని నమ్మలేమని వ్యాఖ్యానించాడు. వారి భర్తలు విదేశాల్లో ఉన్నప్పుడు, చాలామంది భార్యలు వారిని మోసం చేస్తారన్నాడు. వివాహేతర సంబంధాల్లో చిక్కుకోవడం చాలా సాధారణమని వాదించాడు, దీంతో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు గత నెలలో అతగాడిని అరెస్ట్ చేశారు. సోబ్కీ ఈజిప్టు మహిళలను కించపరుస్తూ అగౌరవంగా మాట్లాడాడని న్యాయవాదులు వాదించారు. వారి వాదనలను అంగీకరించిన కోర్టు తన తీర్పును వెల్లడించింది. కాగా ఫేస్ బుక్ లో ‘డైరీస్ ఆఫ్ సఫరింగ్ హస్బెండ్ ‘ అనే గ్రూప్ అడ్మిన్ గా ఈజిప్టులో సోబ్కీ బాగా సుపరిచితుడు. ఆ పేజీకి దాదాపు పదిలక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.