హైదరాబాద్.. దేనికి ఫేమస్ అంటే.. చార్మినార్, హుసేన్ సాగర్, గోల్కొండ, హైటెక్ సిటి, బిర్యాని ఇలా చెప్పేవాళ్ళు గతంలో… ఇప్పుడు వాటితో పాటే 5 రూపాయాలకే భోజనంగా పిలవబడే అన్నపూర్ణ పథకం అనేదీ బాగా ఫేమస్ అయ్యింది. హరేకృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ఈ 5 రూపాయాలకే భోజనం చాలా మంది నిరుపేదల కడుపు నింపుతోంది. హైదరాబాద్ పేదల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వ౦ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 5 రూపాయాలకే భోజనం కోటి మందిని చేరింది. ప్రతి రోజూ దాదాపు 45 వేల మంది ఆకలి తీర్చుతున్న ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికే కోటి మందికిపైగా భోజనం చేశారు. మంచి క్వాలిటితో పాటు శుభ్రతతో అందించడం ఈ పథకం ప్రత్యేకత.
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తెలంగాణాలో మొదటి సారిగా ఈ 5 రూపాయాలకే భోజన పథకం ప్రారంభించారు.అన్ని దానాల కన్న అన్నదానం గొప్పదనే సదుద్దేశం తో అన్నపూర్ణ భోజన పథకం పేరుతో మార్చి 2, 2014న నాంపల్లి సరాయిలో దీన్ని ప్రారంభించారు. హరేకృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్నఈ కేంద్రాల్లో ప్రతి రోజూ ఒక్కొక్క కేంద్రంలో 300 నుంచి 400 మంది చొప్పున రోజూ 45వేల మంది ఆకలి తీర్చుకుంటున్నారు. వీరిలో కూలీలు, విద్యార్థులు, ఆటోడ్రైవర్లు, ఆసుపత్రికోసం వచ్చేవారు, రోగుల సహాయకులు, నగరానికి వచ్చేవారే ఎక్కువ. ప్రతీ రోజు ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ 5రూపాయల భోజనం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 141 అన్నపూర్ణ కేంద్రాలని 150కి పెంచాలని, తద్వారా మరింత మంది కడుపు నింపాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
సిటీ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అశోక్నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లో పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులతో పాటూ నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, పేట్లబుర్జు, కోఠి ఈఎన్టీ, నాచారం, ఎర్రగడ్డ ఈఎస్ఐ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి సహాయకులకు ఈ భోజనం అందుతున్నది. ఈ భోజనానికి ఒక్కో ప్లేటుకి రూ.24.25 ఖర్చవుతుండగా, రూ.19.25 జీహెచ్ఎంసీ భరిస్తోంది. హైదరాబాద్ కి ఎవరొచ్చినా, ఏ పని మీద వచ్చినా, వారికి మంచి ఆహారం అతి తక్కువ ధరలో లభిస్తుండడం మాత్రం జీహెచ్ఎంసీ గొప్పతనమే. అన్నదాత సుఖీభవ.