గత సంవత్సరం నవంబర్ నెలలో పాత 1000, 500 నోట్లు రద్దు చేసి సంచలనం సృష్టించింది మోడీ సర్కార్. ఆ నిర్ణయాన్ని మొదట అభినందించిన సామాన్య జనం నెలలు గడిచినా తగినంత కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ప్రజల కష్టాలను తగ్గించడానికి తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యి ప్రజల కష్టాలు మరింత పెంచాయి. ఇప్పటికి ప్రజలు విత్ డ్రా చేసుకునే ఎమౌంట్ పై ఆంక్షలు ఉన్నాయి ఇటువంటి సమయంలో మూడు నెలల క్రితం ప్రభుత్వం విడుదల చేసిన 2000 రూపాయల నోటు త్వరలోనే రద్దు అవబోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని దేశంలోని ప్రముఖ వార్త సంస్థలు ప్రచురించాయి, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కూడా త్వరలో 2000 నోటు రద్దు అవుతుందని ప్రకటించడంతో ఈ వాదనకు బలం చేకూరినట్లు అయ్యింది.
2000 నోటు రద్దుతో పాటు దాని స్థానంలో కొత్త 1000 రూపాయల నోటు విడుదల చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 2000 రూపాయల నోటు రాజకీయ, ఆర్థిక అవినీతికి కారణమవుతుందన్న కారణంతో దానిని రద్దు చేయనున్నారని రాందేవ్ బాబా తన అభిప్రాయాన్ని తెలియజేసారు. 1000 రూపాయల ప్రింటింగ్ కూడా మొదలయ్యిందని ఐతే చిల్లర సమస్యలు అధికమవడంతో ముందుగా ఎక్కువ 500 రూపాయల నోట్లు ప్రింట్ చేసి మార్కెట్ లోకి వదిలారని అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చిలోనే కొత్త 1000 నోటు అందుబాటులోకి వస్తుందని తెలుస్తుంది.