పేదవాడి సొంతింటి కలని నిజం చేయటానికే అంటూ తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం డబల్ బెడ్రూం ఇళ్ళు. ప్రతీ మనిషికీ తమకంటూ ఒక సొంత గూడు ఉండాలన్న ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం… అర్హులైన వారికి సరైన సమాచారం లేకపోవటంతో అనర్హులు కూడా లబ్ది పొందుతున్నారు. వెల్లువలా వస్తూన్న అర్జీలలో ఏవి సరైనవో ఎవరు అర్హులో తేల్చలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క రంగారెడ్డి పరిధిలోనే 2 లక్షలు వచ్చాయంటే నగరవాసులు ఏ స్థాయిలో ఆసక్తి కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ డబుల్ బెడ్రూం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఇల్లు పొందాలంటే ఎలాంటి ఫార్మట్లో దరఖాస్తులు అందచేయాలి…? ఎవరికి ఎంత కోటా ఉండబోతోంది..? వంటి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు… అయితే మీరు దరఖాస్తు చేసుకోవటానికి స్వయంగా కలక్టరేట్ వరకూ వెళ్ళాల్సిన అవసరం లేదు…. ఏం చేయాలంటే… డబుల్ బెడ్ రూం ఇల్లుకు అర్హత కలిగిన వారు దగ్గరలోని మీ- సేవా కేంద్రానికి వెళ్ళండి…
లేదా
Application for Grant of Double Bed Room House ఈ లింక్ లో మీరు అప్లికేషన్ ఫారం పొందవచ్చు…
మీ-సేవాలో అర్జీఫారం తీసుకొని, అందులో మీ పూర్తి వివరాలను ఫారం లో చెప్పబడ్డట్టు నింపండి ఆ అప్లికేషన్ ఫారంతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, ఆహార భద్రత కార్డ్ ల జిరాక్స్ కాపీలను జతపరచాలి. కుటుంబం లోఉన్న సభ్యులకు ఆధార్ కార్డ్ ఉంటే అదికూడా ఒక కాపీ .ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ లో ప్లాట్ నెంబర్, ఇంటి నెంబర్ తప్పకుండా ఉండేలా చూస్కోండి.
డబుల్ బెడ్ రూం ఇంటి కోసం అప్లై చేసుకున్న వారి ఆధార్ నెంబర్, వారి వయసు, సంవత్సర ఆదాయం మరియు తమ సెల్ ఫోన్ నెంబర్ ను కూడా తెలియజేయాలి.
ఏ గ్రామం, మండలం, కాలనీ, డివిజన్, ల్యాండ్ మార్క్ ఎక్కడ, లొకాలిటీ వంటి అంశాలను తప్పుల్లేకుండా స్పష్టంగా రాయాలి. సెల్ ఫోన్ ఉన్న వారు మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను కూడా ఇవ్వటం మరింత మంచిది. ఇంతకుముందు ప్రభుత్వ పెన్షన్స్, ఇల్లు పొందినవారైతే అందులో క్లియర్ గా ఆ విషయాలని రాయాలి. ఇదంతా పూర్తయిన తర్వాత మీ-సేవా కేంద్రాలలో ఇస్తే, వారు పరిశీలించి ఆన్ లైన్ లో దరఖాస్తు ఫారం, ఫోటోలను అప్ లోడ్ చేసి ఇంకా వేరే వివరాలు ఉంటే నింపుతారు.మీసేవా కేంద్రం లో ఆన్ లైన్ లో ఇదంతా చేసినందుకు రూ.25 చెల్లించవలసి ఉంటుంది.