Home / Inspiring Stories / ఫ్రిజ్ అవసరం లేకుండా 30 రోజుల పాటు నిల్వ చేయవచ్చు..!

ఫ్రిజ్ అవసరం లేకుండా 30 రోజుల పాటు నిల్వ చేయవచ్చు..!

Author:

మాములుగా మనం తెచ్చుకునే కూరగాయలు, పండ్లు మరియు ఇతర ఆహార పదార్థాలు ఎక్కువరోజులు తాజాగా ఉండటం కోసం ఫ్రిజ్ లో నిల్వ చేస్తుంటాం, కానీ ఫ్రిజ్ లో పెట్టినప్పటికీ అవేవి నాలుగైదు రోజులే తాజాగా ఉంటాయి, వారం రోజుల కంటే ఎక్కువ రోజులు తాజాగా నిల్వచేయగలిగే పద్ధతులు లేకపోవటం వల్ల మన దేశంలో లెక్కచేయలేనన్ని ఆహారపదర్థాలు పాడై తినడానికి పనికిరాకుండా పోతున్నాయి, ముఖ్యంగా రైతులు పండించే కూరగాయలలో వినియోగదారునికి చేరేలోపే దాదాపు 40 శాతం పాడైపోతుంది, ఒకవైపు తినడానికి సరైన తిండి లేక చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే..మరోవైపు ఇలా సరైన నిల్వ పద్ధతులు లేక ఆహార పదార్థాలు పడిపోతున్నాయి, అయితే ఈ సమస్యని పరిష్కరించడానికి ఐఐటీ హైదరాబాద్ కి చెందిన ఆడెపు శివ కళ్యాణి అనే విద్యార్ధిని ముద్రికా ఖండేలావాల్ అనే ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ఒక ప్రయోగం చేసి పండ్లు, కూరగాయలు ఫ్రిజ్ అవసరం లేకుండానే దాదాపు నెల రోజులు తాజగా నిల్వ ఉండే పద్దతిని కనిపెట్టారు.

ఆడెపు శివ కళ్యాణి ఐఐటీ హైదరాబాద్ adepu shiva kalyani

నిమ్మ జాతులతోపాటు..ద్రాక్ష పండ్ల రసాలను ప్రయోగశాలలో పద్నాలుగు రోజులపాటు ప్రత్యేక యంత్రాల్లో ఉంచితే బ్యాక్టీరియల్‌ నానో సెల్యులోస్‌ ఫైబర్‌ ఏర్పడుతుంది. ఇది అత్యంత పల్చటి పొరను పోలి ఉంటుంది. శుద్ధి చేసిన అనంతరం..ఆ ఫైబర్ కి వెండి ద్రావణాన్ని కలుపుతారు. ఈ ఫైబర్‌లో మూడు నుంచి అయిదు నానోమీటర్ల అతిసూక్ష్మ రంధ్రాలలో ద్రావణ రూపంలో ఉన్న వెండిరేణువులు అతుక్కుపోతాయి. ‘సూక్ష్మ వెండి రేణువులకు బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంటుంది. అందుకే ఇలా రూపొందిన పొరను చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి పండ్లు, కూరగాయలపై అతికిస్తే..ఆ ఉత్పత్తి ఎక్కువ కాలం పాటు బ్యాక్టీరియాలకు దూరంగా కుళ్లిపోకుండా ఉంటుంది.’ అని ఐఐటీహెచ్‌ పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని రకాల పరీక్షలూ పూర్తయ్యాయని, అన్నింట్లోనూ మంచి ఫలితాలే వచ్చాయని తెలిపారు. ‘టమాటాపై ఈ పొర అతికించి గది ఉష్ణోగ్రత వద్ద పరీక్షలు చేయగా..30 రోజుల వరకు అది తాజాగా ఉంది. అదే టమోటాను పాలిథీన్‌ సంచి, మైక్రోపోరస్‌ పాలిప్రొపిలిన్‌ సంచులతోనూ పరీక్షించాం. పాలిథీన్‌ సంచిలో ఉంచిన టమాటా ఏడు రోజులకే పాడైంది. మైక్రోపోరస్‌ పాలిప్రొపిలిన్‌ సంచిలో ఉంచింది 15వ రోజు నాటికి కుళ్లిపోవడం మొదలైంది.’ అని వెల్లడించారు. ఈ పరిశోధనాంశాలు ఇటీవలే జర్నల్‌ ఆఫ్‌ మెటీరియల్‌ సైన్స్‌లోనూ ప్రచురితమయ్యాయన్నారు. ఇంకా పేరుపెట్టని ఈ ఉత్పత్తిని విపణిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ‘ఈ సాంకేతికత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఎక్కువ రోజులు కూరగాయలు, పండ్లను తాజాగా ఉంచేలా చూడవచ్చు. దీనివల్ల తక్కువ ఖర్చుతో అటు రైతులకు, ఇటు వినియోగదారులకు చక్కని ప్రయోజనం దక్కుతుంది.’ అని వివరించారు.

ఈ పదార్థాన్ని వైద్యంలో కూడా ఉపయోగించవచ్చని శస్త్రచికిత్సల అనంతరం ఆ భాగంలో హానికారక బాక్టీరియా వృద్ధి చెందకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా చేసి గాయం త్వరగా మానేలా చేస్తుందని తెలిపారు, దీనిని రైతులు కూరగాయలను, పండ్లను తరలించేటప్పుడు వాటిపై ఈ పదార్థాన్ని ఉంచితే అవి ఎక్కువ కలం తాజాగా ఉంటాయని తెలిపారు…ఇంకా పేరు పెట్టని ఈ పదార్థం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని..ముఖ్యంగా ఆహార పదార్థాలని తాజాగా ఉంచి ఆకలి చావులు లేకుండా చేయడంలో ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రయోగంతో దేశంలో ఆకలిచావులు తగ్గించేలా మరియు రైతులకి లాభం చేకూరేలా చేసిన ఆడెపు శివ కళ్యాణి ని ఖచ్చితంగా అభినందించాల్సిందే..!

(Visited 758 times, 1 visits today)