చెన్నై లో ప్రకృతి భీబత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది సైన్యం,నేవీ,ఎయిర్ఫోర్స్ మొత్తం త్రివిద దళాలూ సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయి.సహాయ, పునరావాస కార్యక్రమాలకు ‘ఆపరేషన్ మదద్’గా నామకరణం చేశారు. భారత వైమానికి దళం ఆపరేషన్ మదద్గా నామకరణం చేసింది. సైన్యం, నావికాదళం, ఎయిర్ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. చెన్నై విమానాశ్రయంలో చిక్కినవారిని విమానాల ద్వారా హైదరాబాద్ తరలిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నారు. సైన్యం వైద్య బృందంతో పాటు మరో 9 సహాయ బృందాలను తాజాగా చెన్నై పంపించింది. విశాఖపట్నం నుంచి మరో రెండు నౌకాదళ యుద్ధనౌకలు చెన్నై చేరుకున్నాయి. రెండు యుద్ధనౌకల్లో 30 టన్నుల ఆహారపదార్థాలు, తాగునీరు తీసుకువచ్చారు. అరక్కోణం వైమానిక స్థావరం నుంచి ఏయిరిండియా విమాన సేవలు నడుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు తమిళనాడు కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. చెన్నైలో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.వరదల బీభత్సం సందర్భంగా ఫేస్బుక్ సేఫ్టీచెక్ ఫీచర్ యాడ్ను అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా తమ బంధువులు, స్నేహితుల సురక్షిత సమాచారాన్ని ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి చేరేలా ఏర్పాటు చేసింది. వెనువెంటనే సమాచారాన్ని అందజేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. నేపాల్ భూకంపం, ప్యారిస్లో ఉగ్రవాదుల నరమేధం సందర్భాల్లో కూడా ఈ సేఫ్టీచెక్ ఫీచర్ యాడ్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా, మరో 72 గంటల పాటు చెన్నైలో వర్షాలు కురుస్తాయని అయితే, రానున్న రెండ్రోజులు అత్యంత విషమ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్సింగ్ రాథోడ్ వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తమిళనాడును ఆనుకుని స్థిరంగా కేంద్రీకృతమైవుందని చెప్పారు. ఆ ప్రాంతంలోనే 1.5 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కేంద్రీకృతమైన ఉన్నట్లు వివరించారు. ఆకలితో వ్యాపారం చేస్తూ దోచుకుంటున్నారు.
తినేందుకు బోజనం ఎటూలేదు కనీసం చలినుంచి,ఆకలినుంచీ కాస్త ఉపశమనం పొందడానికి కాఫీ టీ లు కూడా దొరకటం లేదు. పెద్దవారి సంగతి ఎలా ఉన్నా పసిబిడ్డలకు పట్టడానికి కూడా పాలు లభ్యం కాని పరిస్థితి నెలకొంది. చివరకు ఎండిపోతున్న నోటిని తడుపుకోవడానికి చుక్క మంచి నీరు కరువైంది. హృదయవిదారకంగా ఉన్న ఈ పరిస్థితుల్లో వ్యాపారులు విజృంబిస్తున్నారు. లాభం కోసం అమ్ముకోవడం అనేది వదిలేసి దోచుకోవడం మొదలుపెట్టారు. చెన్నైలో ఇప్పుడు లీటర్ పాలధర 100 రూపాయిలు పలుకుతోంది. సాధారణంగా 20 రూపాయిలకు దొరికే మంచినీళ్ల బాటిల్ 150 రూపాయిలకు చేరింది. కూరగాయల సంగతి చెప్పనక్కరలేదు. కూర’గాయాలు’గా మారి ప్రజలను మరింత బాధిస్తున్నాయి. టమాటాలు బీన్స్ వంటి కూరలు 90 రూపాయిలు అంతకంటే ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తోంది. ఇంత చేసి వాటిని కొనుగోలు చేస్తే….అవి ఇంటికి చేర్చుకోవడానికి అంతే కష్టం అనుభవించాల్సి వస్తోంది.
అన్నింటికంటే ధారుణం కనీసం మరణించిన వారి శవాలకు అంత్య క్రియలు నిర్వహించే అవకాసమే లేకుండా పొయింది.నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఓ మహిళ చనిపోయిన తన తల్లి శవం వద్ద ఏకంగా 20 గంటల పాటు జాగారం చేస్తోంది. ఆమెను ఎవ్వరు పట్టించుకోకపోవడంతో తల్లి శవం వద్ద అలాగే ఉంది. చివరకు సన్నిహితుల ద్వారా మీడియాను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ తన తల్లి డయాలిసిస్ ఫేషెంట్ అని ఆమె బుధవారం మృతిచెందగా…అప్పటి నుంచి కరెంటు లేకపోవడంతో చీకట్లోనే మగ్గుతున్నామని ఆమె వాపోయింది. తన తల్లి శవాన్మి శ్మశానానికి తరలించేందుకు దయచేసి ఎవరైనా తనకు సహాయం చేయాలని…..వాహనం పంపాలని ఆమె వేడుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె సన్నిహితులు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకు రావడంతో ఆమె తల్లి శవంతోనే 20 గంటల పాటు జాగారం చేస్తున్న విషయం బయటకు వచ్చింది.ఇప్పటికీ ఆమె అంత్యక్రియలు జరిపే ప్రయత్నాలు ఎంత వరకూ వచ్చాయో తెలియదు.
కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. చెన్నై వరదల ప్రభావం నుంచి కోలుకునే వరకు లేదా కనీసం వారం రోజుల పాటు చెన్నై పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కాల్స్ ని ఉచితంగా అందించనుంది. మొత్తం చెన్నై సర్కిల్ పరిధిలో అన్ని కాల్స్, ఎస్ఎంఎస్ లను వారం రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించింది. ఎయిర్ టెల్ సంస్థ ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఖాతాలో రూ. 30 టాక్ టైమ్ జమ చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్ని చెన్నై ప్రైవేటు సంస్థలు సైతం తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చాయి.