భారత దేశం బంగారు దేశం అనిపించుకుంది. భారతీయులు అలంకరణ లో ఎంత ఖర్చుకీ వెనుకాడ బోమని మరో సారి ఋజువు చేసారు. నిన్నటి వరకూ బంగార వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న చైనాని తోసి రాజని భారత దేశాన్ని అగ్ర స్థానం లో నిలిపారు.. 2015 వ సంవత్సరానికి గానూ భారత బంగారం వినిమయం 642 టన్నులకు చేరుకుంది.చైనా మనకంటే 63 టన్నుల తక్కువ వినియోగం (579టన్నులు) తో ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచింది. మీడియా దిగ్గజం థామ్సన్ రాయిటర్స్లో భాగమైన జీఎఫ్ఎంఎస్ ఒక నివేదికని ప్రచురించింది. దీని ప్రకారం భారత్లో ఆభరణాల వినియోగం క్రితం ఏడాది క్యూ3తో పోలిస్తే ఈసారి మూడో త్రైమాసికంలో 5 శాతం పెరిగి 193 టన్నులుగా నమోదైంది. 2008 తర్వాత మూడో త్రైమాసికంలో ఇంత ఎక్కువగా డిమాండ్ కనిపించడం ఇదే మొదటి సారి. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికి ఇండియాలో ఆభరణాల కొనుగోలు వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి 193 టన్నులకు చేరుకుంది. 2011లో మొదటి త్రైమాసికం తర్వాత ఇదే అతిపెద్ద త్రైమాసిక వినియోగం.అంతే కాదు 2008 తర్వాత మళ్లీ మూడో త్రైమాసికంలో ఇంత పెద్దమొత్తంలో వినిమయం నమోదుకావడం ఇదే మొదటిసారి. ఇక రిటైల్ పెట్టుబడులు 30 శాతం పెరిగి 55 టన్నులకు చేరుకుంది. దేశంలో బంగారం ధరలు ఆగస్టు 2011నాటి స్థాయికి పడిపోవడం వినిమయం పెరగడానికి కారణమైంది.
2011 ఆగస్టు తర్వాత పసిడి ధరలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోవడంతో క్యూ3లో పసిడికి డిమాండ్ పెరిగిందని విశ్లేషించింది. దీని వల్లే మూడో త్రైమాసికంలో బంగారం దిగుమతులు 23 శాతం ఎగిసి 263 టన్నులుగా నమోదైంది.మరోవైపు, సరఫరా విషయానికొస్తే అంతర్జాతీయంగా పసిడి ఉత్పత్తి కేవలం ఒక్క శాతమే పెరుగుదలతో సుమారు 851 టన్నులకు పరిమితమైంది.