ఎన్ని దేశాలు తిరిగినా ఎంత సాధించినా ఒక మనిషి తాను పుట్టిన గడ్డ మీదే కనుమూయాలనుకుంటాడు. తన మాతృదేశం మట్టిలోనే తన శరీరమూ కలవాలి అనుకుంటాడు… అయితే భారత భూమి మట్టి మహిమో లేదంటే అతన్ని ఈదేశం మరెలా ఆకర్షించిందో కానీ ఈకడే బతకాలనుకున్నాడు ఈ దేశం లోనే తన తనువు చాలించే వరకూ గడిపేయాలనుకున్నాడు. అతనొక్కడే కాదు తన కుటుంబం మొత్తాన్నీ తన స్వంత దెశమైన ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి తనతో పాటు రప్పించాడు. నరికిన అడవులతో ఎడారిగా మారబోతున్న ఈ భరత భూమిని మళ్ళీ పచ్చని అరణ్యం తో నింపాలనుకున్నాడు…ప్రకృతిపై ప్రేమతో.. ఉన్నత ఉద్యోగాన్ని.. స్వదేశాన్ని వదిలిపెట్టి.. దేశం కాని దేశంలో సేవ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇజ్రాయెల్కు చెందిన అవిరామ్ రోజిన్ 2000 సంవత్సరంలో భారత్లో పర్యటించేందుకు వచ్చాడు. ఇక్కడి ప్రముఖ కట్టడాలు. అందమైన ప్రదేశాలు., భిన్నమైన సంస్కృతీ సంప్రదాయాలు అతన్ని ఆకట్టుకున్నాయి. అయితే… అవిరాం కేరళ పర్యటనకి వెళ్ళి అక్కడినుంచి నుంచి చెన్నైకి వస్తున్నప్పుడు అటవీ విస్తీర్ణం తగ్గిపోవడాన్ని గమనించాడు. ప్రకృతి మాత లా ఉండే భారత దేశం ఇలా ఎడారి పోలికలను కొంచంగా తెచ్చుకోవటం అతని మనసుని కలచివేసింది. చెన్నైలో ఉన్న మిత్రుడి సాయంతో అక్కడి పరిస్థితుల గురించి వివరాలు తెలుసుకుని. స్వదేశానికి వెళ్లాడు అయితే అప్పుడే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదెమిటంటే తను త్వరలో ఇక్కడికే రాబోతున్నాడు, ఇక నుంచీ తనదేశం పేరు భారత దేశం అని.
మూడేళ్ల తర్వాత.. స్వదేశంలో ఉద్యోగాన్ని వదలి భార్యాపిల్లలతో.. భారత్కు వచ్చేశాడు. తమిళనాడులోని ఆరోవిలే ప్రాంతానికి చేరుకుని.. అక్కడే 70 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. చుట్టు పక్క గ్రామాల్లో పెరిగే విత్తనాలను, పండ్ల మొక్కలను సేకరించి, తాను కొన్న ఆ 70 ఎకరాల స్థలంలో నాటాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అలా 13 ఏళ్లుగా మొక్కలు పెంచుతూ పోయాడు. ఆ ప్రయత్నం లో అతనికి తెలియకుండానే ఆ తోట ఒక అడవిలా మారిపోయిది ఆ డెబ్బయ్ ఎకరాలలోనూ ఏర్పడ్డ మినీ అడవికి ‘సాధన ఫారెస్ట్’ అని పేరు పెట్టాడు. సమీప గ్రామాల్లోని ప్రజలకు మొక్కల పెంపకం గురించి సలహాలు సూచనలు ఇస్తున్నాడు.
తాను కొన్న స్థలాన్ని అడవిలా మార్చడమే కాదు అక్కడే వేలాది మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మరీ భూతాపాన్ని తగ్గించటం లోనూ మనిషి మనుగడలోనూ చెట్లకున్న ప్రాధాన్యత ఏమిటో వివరిస్తూనే అడవుల పెంపకం దాని ఆవశ్యకతను వివరిస్తున్నాడు. ఇప్పుడు సాధనా ఫారెస్ట్ దేశ విదేశాల నుంచి విద్యార్థులను ఆకర్షిస్తోంది. అక్కడికి వచ్చే విద్యార్థులకు ఉచిత వసతి కల్పించడంతో పాటు.. సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. పర్యావరణానికి హానికలగకుండా సోలార్ విద్యుత్తు, గ్రీన్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ సక్సెస్ అయిన పద్దతిలోనే సాధన ఫారెస్ట్ను హైతీ, కెన్యా వంటి దేశాల్లోనూ విస్తరించాడు. అక్కడి ప్రజల్లో పండ్ల తోటల పెంపకం పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నాడు. పండ్ల తోటల పెంపకం ద్వారా అక్కడి ప్రజలకు ఆహారం అందడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నాడు రోజిన్. రోజిన్ చేస్తున్న సేవలకు అంతర్జాతీయ స్థాయిలో పలు బహుమతులు అందుకున్నాడు. సాధన ఫారెస్ట్ గురించి మరిన్ని వివరాలు ఈ http://sadhanaforest.org వెబ్సైట్ లో చూడండి.