నిజంగా గ్రేట్. వింటేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. బాధతో పాటే, ధైర్యాన్ని ఇస్తుంది ఈ అబ్బాయి మనో స్థైర్యం చూస్తుంటే. ఈ రియల్ హీరో పేరు తుషార్ రిషి. ఝార్ఖండ్లోని రాంచీ సొంత ఊరు. జస్ట్ 19 ఏళ్ల రిషిని క్యాన్సర్ మహమ్మారి కాటేసింది. అయితే రిషి దేనికీ బెదరలేదు.. కుంగిపోలేదు. బాగా చదువుకోవలన్నదే తన కోరిక. ఓ వైపు క్యాన్సర్తో పోరాడుతూనే, ట్రీట్మెంట్ చేయించుకుంటూ, బాధని పంటి కింద భరిస్తూనే, తన లక్ష్యం కోసం మనోధైర్యంతో ముందుకెళ్లాడు. గత ఆదివారం వెలువడిన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 95శాతం మార్కులు సాధించి, అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
2014లో, 10వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే మూడేళ్ల క్రితం రిషి బోన్ క్యాన్సర్ బారిన పడ్డాడు.దాంతో ఆ ఏడాది పరీక్షలు రాయలేకపోయాడు. ఎడమ మోకాలిని క్యాన్సర్ తినేస్తుండటంతో దాదాపు 11 నెలల పాటు కీమోథెరపీ చికిత్స పొందాడు. ఎంతో శారీరక మానసిక భాదని అనుభవించాడు. కానీ, ఎలాగైనా చదువుకోవాలనే లక్ష్యంతో అన్నీ భరించాడు. మనోధైర్యాన్ని వీడలేదు. మానసికంగా మరింత దృఢంగా మారాడు. అయితే క్యాన్సర్ ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో ప్రతి మూడు నెలలకోసారి అతడు డిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స చేయించుకోవాలి. దీంతోస్కూలుకు సరిగా హాజరుకాలేకపోయాడు. పైగా మోకాలి నొప్పితో ఎక్కువసేపు కూర్చోలేకపోయేవాడు. అయినా వీటన్నింటినీ అధిగమించి 2015లో మళ్లీ పదో తరగతి పరీక్షలు రాసి, 10 పాయింట్లు సాధించాడు. ఇప్పుడు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 95శాతం సాధించాడు.
చిన్న సమస్యకో, పరీక్షలో మార్కులు తక్కువచ్చాయనో, ఫెయిల్ అయ్యాననో కుంగిపోయి, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఒకసారి రిషి ని చూసి నేర్చుకోవాలి. సమస్యలను ఎదురొడ్డి ఎలా పోరాడాలో రిషిని చూసి స్పూర్తి పొందాలి. ఒకటే మరణం..ఒకటే జననం.. గెలుపు పొందు వరకూ.. అని అందరికీ స్పూర్తినిస్తున్న రిషి కి హాట్స్ ఆఫ్ చెబుతోంది అలజడి. క్యాన్సర్ ని జయించి ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటోంది.