ఆఫీసుకు ఆలస్యంగా వచ్చినందుకు తోటి మహిళ ఉద్యోగిని చితకబాదాడు ఓ సహోద్యోగి. శనివారం నాడు కాస్త లేటుగా వచ్చినందుకు నస్రీన్ అనే మహిళను విచక్షణా రహితంగా కొట్టాడు తోటి ఉద్యోగి శరణప్ప. కర్నాటక లోని రాయచూరు ప్రభుత్వ కార్యాలయంలో జరిగింది ఈ దుర్మార్గపు సంఘటన. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు, పైగా ఆమె మహిళ. శనివారం కాబట్టి ఆరోజు ఉద్యోగులు కూడా అందరూ రాలేదు. అంతేకాదు, రంజాన్ మాసం కాబట్టి ఉపవాస దీక్షలో కూడా ఉందన్న ఆలోచన కూడా లేకుండా ఆమెపై చేయి చేసుకోవడం ఎంత దుర్మార్గం. అయితే ఆ పురుషాహంకార ఉద్యోగి వికృత చేష్టలన్నీ ఆఫీసులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
సమయానికి రాలేదన్న కోపంతో తోటి మహిళా ఉద్యోగి వైపు ఆవేశంగా వెళ్ళడం.. ఆమె దూరంగా జరిగినప్పటికీ ఆమె పైకి వెళ్లి కాలితో తన్నడమే కాకుండా దుర్భాషలాడుతూ కొట్టడం మొత్తం ఆఫీసులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా ఆ మహిళా ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ కర్కశ ఉద్యోగి శరణప్పను విదుల్లోంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు విచారిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలే మహిళలను మరింత అభద్రతాభావం లోకి నెట్టేస్తాయని, ఎక్కడా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఒక మహిళ అని కూడా చూడకుండా క్రూరంగా ప్రవర్తించిన శరణప్పను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, తోటి ఉద్యోగులు కోరారు. ఆ పురుషాహంకార దుర్మార్గాన్ని ఈ క్రింది వీడియోలో చూడండి.