మిద్దె రాములు… ఒగ్గు కథ అని వినగానే మొదట గుర్తొచ్చే పేరు. 1942లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో జన్మించారు. తల్లిదండ్రులకు కలిగిన ఐదుగురు సంతానంలో .. మన మిద్దె రాములు చిన్నవాడు. స్వయం కృషితో ఒగ్గుకథ నేర్చుకున్నాడు. గీతకార్మిక కుటుంబంలో జన్మించిన రాములు, కథ చెప్పే తీరుకు ఎవరైనా మంత్ర ముగ్ధులు కావాల్సిందే. కథ చెప్పుకుంటూ తనదైన శైలిలో నృత్యం చేస్తూ, ఎటువంటివారైనా కథలో లీనమైపోయేలా చేస్తుంటాడు.
40 ఏళ్లకు పైగా ఒగ్గు కథకు రాములు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఉత్తర తెలంగాణ పల్లెల్లో మిద్దె రాములు కథ తెలియనివాళ్లుండరు అంటే అతనెంతటి ప్రతిభావంతుడే అర్ధం చేసుకోవచ్చు. పల్లెను, పల్లె జీవితాన్ని జానపద కళలతో ప్రదర్శించేవారు. పురాణాలను, సాహితీ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా, అర్ధవంతంగా చెప్పడం రాములు లోని గొప్ప విషయం. జనరంజకంగా కథ చెప్పడం రాములుకే సొంతం. తెలంగాణలో ఆయన ప్రేరణతో ఎంతోమంది కళాకారులు పుట్టుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలోని కళకారులు రాములు లాగ కొన్ని ప్రదర్శనలు చేసి జనాలచేత మన్ననలు పొందారు.
మిద్దె రాములు ఎల్లమ్మ కథ, సారంగధర, ఐదు ఓల్లె పూలు, గంగా గౌరి కథలు, చారిత్రక గాథలు అద్భుతంగా చెప్పే వారు. తెలంగాణ ఉద్యమానికి బోనం సింబాలిజం చేసింది కూడా మిద్దె రాములే. తెలంగాణ ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బోనం నెత్తిన పెట్టుకుని ప్రదర్శనలు చేసిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. వీక్షకులు, అతని ప్రదర్శనలు ప్రత్యక్షంగా వీక్షించినందుకు తాము అదృష్టవంతులుగా భావిస్తుంటారు.
ఈ తరం కుర్రకారు కూడా అతని మార్గంలో వెళ్ళటానికి ఆసక్తి చుపిస్తున్నారంటే, ఒగ్గు కథలో అతని ప్రస్తానం ఎలా కొనసాగిందో అర్థంచేసుకోవచ్చు. తన 40 సంవత్సరాల కథా జీవితంలో మందిని అలరించిన ఆ గొంతు… 2010 నవంబర్ 25న మూగబోయింది. భౌతికంగా మిద్దె రాములు లేకున్నా.. ఆయన చెప్పిన ఒగ్గు కథలు.. జనం చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి.తన ఒగ్గు కథలతో ప్రజలలో చైతన్యం నింపిన మిద్దె రాములుని ఎప్పటికి మరిచిపోకుండా ఆయన జీవితాన్ని పాఠ్య పుస్తకాలలో పాఠంగా చేర్చాల్సిన అవసరం ఉంది.