తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడనున్నారు. ఎన్నికల సర్వే ఫలితాలను ఆయన వెల్లడించనున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరి ఆసక్తి ఆ సర్వే ఫలితాలపైనే. రాష్ట్రంలో 68.5 శాతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదైతే కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే ఆయన తెలిపారు. 2014 ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ నమోదయితే హంగ్ ఫలితాలు వస్తాయని వెల్లడించారు. స్వతంత్రులు అధిక సంఖ్యలో గెలుస్తారనీ, బీజేపీ సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు.
నాలుగు జిల్లాల్లో ప్రజాకూటమి, మూడు జిల్లాల్లో టీఆర్ఎస్, మరో రెండు జిల్లాల్లో కూటమి, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పరిస్థితి ఉందని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో ఎంఐఎం అత్యధిక సీట్లను గెలుచుకుంటుందన్నారు. మిగిలిన సీట్లను అన్ని పార్టీలు పంచుకుంటాయన్నారు. ఆ మరుసటి రోజే వరంగల్లో కూడా కూటమి ఆధిక్యంలో ఉందని వెల్లడించారు. తాజాగా ఈ రోజు రాత్రి 7గంటలకు నిర్వహించబోయే ప్రెస్మీట్లో ఏఏ పార్టీలకు ఎన్ని ఎన్ని సీట్లువస్తాయో చెప్పే అవకాశం ఉంది.
మధ్యాహ్నం 3గంటల వరకు 57.16శాతం పోలింగ్ నమోదైంది. సమస్యాత్మకంగా గుర్తించిన 13 నియోజకవర్గాల్లో పోలింగ్ను అధికారులు 4గంటలకే ముగించారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద వేచి ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తున్నారు.