శరీరంలో ఎదైనా భాగం నొప్పితో బాధిస్తుంటే వెంటనే వంటింటి చిట్కాలైనా వేడి నీళ్ళ తాపడం లేదా నూనే తో మసాజ్ చేయడం చేస్తారు మన ఇంట్లో వారు. ప్రతి చిన్న విషయానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అలవాటు మనలో ఎవరికి ఉండదు కాని నొప్పికి అసలు కారణం తెలుసుకోకుండా వంటింటి చిట్కాలు వాడితే ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. కాలికి గాయమై, రక్తం గడ్డకట్టి బాధపడుతున్న తన కొడుకుకి ఉపశమనం కలిగిద్దామని అతని తల్లి చేసిన మసాజ్ అతని ప్రాణాలు తీసింది. అతని మరణానికి గల కారణాలు క్రింద చదవండి.
ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యువకుడికి బ్యాడ్మింటన్ ఆడే సమయంలో కాలి మడమకు గాయమైంది, దాని ఫలితంగా అతని కాలి నరాల్లో రక్తం గడ్డకట్టింది. ప్రధమ చికిత్స లో భాగంగా అతని కాలికి ప్లాస్టర్ వేసి విశ్రాంతి తీసుకోమని చెపారు కాని అతని కాలి నొప్పి, వాపు వలన కలిగే బాధ చూడలేని అతని తల్లి నొప్పి ఉన్న కాలుకి ఆయిల్ తో మసాజ్ చేసింది. మసాజ్ చేసే సమయంలో ఆమె ఉపయోగించిన శక్తికి కాలిలో గడ్డకట్టిన రక్తం అక్కడి నుండి కదిలి, అతని ఊపిరితిత్తుల్లోకు రక్తాన్ని సరఫరా చేసే పుఫుస ధమనుల్లోకి ప్రయాణించి వెంటనే అతని గుండె ఆగిపోయేలా చేసింది. తరువాత నిర్జీవంగా పడి ఉన్న తన కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళినా అతని ప్రాణం దక్కించుకోలెక పోయింది ఆ తల్లి. అందుకే వంటింటి వైద్యం అన్ని సంధర్బాల్లో పనికిరాదు అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.