ఇప్పుడు మనం రోడ్ పైకి వాహనంతో వెలితే మన దగ్గర ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్, బండి ఆర్సి, అన్ని పత్రాలు ఉండాలి. లేకుంటే పైన్ రూపంలో జేబులు ఖాళీ అవటం ఖాయం. కొత్తగా తెలంగాణా రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఐటీ శాఖా మంత్రి కె. తారకరామారావు శనివారం ‘ఎం వ్యాలెట్’ అనే సేవను ప్రారంభించారు. ఐటీ సేవలను మరింత విస్తరించే క్రమంలో… తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని వాహనదారులకు కూడా మరింత వెసులుబాటును, సౌకర్యాలను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. వాహనదారులు తమ వాహనాల ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులతో సహా బీమా పత్రాలన్నింటినీ కూడా ‘డిజిటలైజ్’ చేసుకోవచ్చు.
ఇందుకు చేయాల్సిందల్లా… ‘ఎం వ్యాలెట్’ పేరుతో రవాణాశాఖ శనివారం నుంచి అందుబాటులోకి వచ్చిన మొబైల్ అప్లికేషన్ ను డౌనలోడ్ చేసుకోవటమే. అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలతో ఉన్న స్మార్ట్ఫోనలలో మాత్రమే ఈ యాప్ పని చేస్తుంది. ఒకసారి ఈ ‘ఎం వాలెట్’ యాప్ను డౌనలోడ్ చేసుకున్న తర్వాత… తమ వాహనాలకు సంబంధించిన ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్), బీమా పత్రాలు, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సుల వంటి వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ ‘అప్లోడ్’ చేస్తే చాలు. ఆ వివరాలన్నీ కూడా ఈ యాప్ ద్వారా రవాణాశాఖ సెంట్రల్ సర్వర్కు చేరతాయి. ఇక ఆయా సర్టిఫికెట్లన్నీ ‘డిజిటలైజ్’ అయిపోయినట్లే. అవి డిజిటలైజ్ అయినట్లుగా మనకో నంబర్ కూడా వస్తుంది. ఇక అధికారులు తనిఖీల్లో భాగంగా ఆపిన సందర్భాల్లో… ఆ నంబర్ను, లేదా మన వాహనం నంబర్ను చెబితే చాలు. సదరు అధికారులు తమ నెట్వర్క్ ద్వారా వాటిని ధ్రువీకరించుకుంటారు. లేదా మన మొబైల్ యాప్ ద్వారా కూడా అధికారులకు ఆ వివరాలను చూపించవచ్చు.