శరీరం రెండు ముక్కలైంది… కొన్ని క్షణాల్లో ప్రాణాలు పోతాయి ఆ క్షణం లో ఎవరికైనా ఏం గుర్తొస్తుంది…!? ఆమ్మా…!? నాన్న..!? స్నేహితులు, ప్రేమించిన అమ్మాయి..? ఇంకేదైనా గుర్తొస్తుందేమో…. కానీ అతనికి మాత్రం తన శరీరంలోని అవయవాలతో మరొకరిని బతికించాలనిపించింది. తన ప్రాణాలు పోవటానికి కొన్ని క్షణాల ముందు. తన చుట్టూ చేరిన జనాలని చూస్తూ అతను చెప్పిన మాటేమిటో తెలుసా… ” నా శరీరంలో పనికొచ్చే ఏ భాగాన్నైనా మరొకరికి అమర్చేందుకు ఇవ్వండీ” అని… లారీ కింద పడ్డ తన దేహం రెండు ముక్కలు గా మారినా… ఆ సమయం లోనూ అతను తన శరీర భాగాలను మరొకరికి ఇవ్వండి అని చెప్పి మరణించాడు… వివరాల్లోకి వెళితే…
కర్నాటక కు చెందిన హరీశ్ నంజప్ప అనే 23 ఏళ్ళ యువకుడు బెంగుళూరులో ఉంటున్నాడు. తన స్వగ్రామం “గొబ్బి”కి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లాడు. తన ఓటుహక్కును వినియోగించుకొని బెంగళూరుకు తిరిగొస్తుండగా.. జాతీయ రహదారి4 పై ఉన్న తిప్పగొండనహళ్లి అనే గ్రామం వద్ద పంచాదార బస్తాలతో వస్తున్న ఓ లారీ.. పల్సర్ పై వెళుతున్న హరీశ్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. దీంతో అతడు లారీ టైర్ల కింద పడిపోయాడు. అలా పడిపోగానే అతడి దేహం రెండు ముక్కలుగా విడిపోవడంతోపాటు నడుము నుంచి కాళ్ల వరకు ఉన్న భాగాన్ని లారీ కొన్ని అడుగుల మేర ఈడ్చుకెళ్లింది. తలతో ఉన్న మొండెం భాగం మరోచోట పడిపోయింది. అతడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు ఎలాంటి గాయాలు కాలేదు.
ప్రాణం పోతున్న ఆ కొద్ది ఘడియల్లోనే రోడ్డుపై వెళ్లేవారిని దగ్గరకు పిలిచి తన అవయవాల్లో ఏది పనికొస్తే అది దానం చేయాల్సిందిగా కోరాడు. ఈలోగా స్థానికులు రెండుగా విడిపోయిన అతడి శరీర భాగాలను ఓచోట చేర్చి ఆస్పత్రికి తరలించారు. కానీ కాసేపట్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటి ఘోర రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర బాధాకరమైన పరిస్థితుల మధ్య కూడా హరీశ్ కి క్షణాల్లో తన అవయవాలు దానం చేయాలన్న ఆలోచన రావడం మామూలు విషయం కాదనీ, అతన్ని చూసిన ఆసుపత్రి వైద్యులు సైతం కంటతడి పెట్టుకున్నారట… మరణం అంచులోనూ మరొకరి ప్రాణాలు కాపాడాలనే ఆలోచనతోనే ఉన్న హరీష్ కు నివాళులతో “అలజడి.కాం”.