‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కౌన్ బనేగా కరోడ్ పతీ కి తెలుగు పేరడీ గా తెలుగులోనూ నాగార్జున తో నిర్వహించే ప్రోగ్రాం ఎంత క్రేజీ గా మారిందో మనకూ తెలుసు. ఇదే షోలో చూస్తూండగానే లక్షాధికారులైన వారెందరో… ఐతే డిసెంబర్ 18 న ఈ షో లో పాల్గొన్న రావణ శర్మ వీరందరికంటే కాస్త వేరు ఎందుకంటారా…?
మీలో ఎవరు కోటీష్వరుడు షో లో గెలుచుకున్న రూ.25 లక్షల్లోని రూ. 20 లక్షలను స్వచ్ఛంద సంస్థలపై ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రావణ శర్మ. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి కొన్నేళ్ల క్రితం తెలంగాణాకు వచ్చిన శర్మ ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిలో స్థిరపడ్డారు. శర్మ రిటైరయ్యాక పింఛన్గా వచ్చిన డబ్బులు అప్పులకు, గృహావసరాలకు ఖర్చుకాగా, అయినవారు అనుకునే రక్త సంబందీకులే ఆదరించకపోవడంతో స్నేహితుల సహకారంతో ఇక్కడికి వచ్చి ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.
ఐతే ప్రతిభ ఉన్నచోటే ఆగిపోదు కదా మీలో ఎవరు కోటీష్వరుడు కోసం ట్రై చేసి సెలక్ట్ అయిన శర్మ గతనెల ఈ రియాల్టీ షోలో 18న రూ.25 లక్షలను గెలుచుకున్నారు శర్మ. వచ్చిన మొత్తం నుంచి రూ. 10 లక్షలు హైదరాబాద్కు చెందిన నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ సంస్థ , మరో రూ. 10 లక్షలు శ్రీ విద్యా సెంటర్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ సంస్థపై డిపాజిట్ చేశారు. ఆయన బతికున్నంత వరకు బ్యాంకు వడ్డీ వస్తుంది. ఆయన మరణానంతర అసలు, వడ్డీ స్వచ్ఛంద సంస్థలకు వెళ్తుంది. వీటితోపాటు తాను కష్టాల్లో ఉన్న నాడు తనను మనిషిగా గుర్తించి సహాయం చేసిన ఒక మాతృమూర్తి పేరిట రూ. 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.ఎంత మంది చేయగలరిలా..? కొన్ని గంటల్లో తనకు వచ్చిన డబ్బుని తనంతట తానుగా మరికొందరి కోసం ఇచ్చేయటం ఎందరు మాత్రం చేస్తారు..! ఒక టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలని మీరే వినండి….