భారత దేశంలో ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవంగా ఆలపించే గానం జాతీయ గీతం. కుల,మత,భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. చిన్నతనం నుంచి ప్రతి విద్యార్థికి జాతీయ గీతంపై ఎంతో గౌరవాన్ని పెంచుతారు ఉపాధ్యాయులు. అలాంటి జాతీయ గీతానికి అవమానం జరిగింది.అందులోనూ ఓ ప్రజాప్రతినిధి చేతిలో…
వివరాల్లోకి వెళితే..సాధారణంగా జాతీయ గీతాన్ని ఆలపించేందుకు పట్టే సమయం 52 సెకన్లు. ఆ 52 సెకన్లు కూడా జాతీ కోసం వినియోగించలేక పోయింది ఓ ఎమ్మెల్యే. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని హౌరా జిల్లాలో వెలుగు చూసింది. బాలీ నియోజకవర్గం ఎమ్మెల్యే వైశాలి దాల్మియా ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వచ్చారు. మ్యాచ్ ప్రారంభం కంటే ముందు స్టేడియంలో జాతీయగీతాలపన చేశారు. అందరూ శ్రద్దగా జాతీయ గీతం ఆలపిస్తుంటే ఎమ్మెల్యే మాత్రం ఫోన్లో మాట్లాడారు.
అయితే ఎమ్మెల్యే తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రజా ప్రతినిధి ఇంత సిగ్గుమాలిన పనికి పాల్పపడితే సామాన్యుల పరిస్థితి ఏంటీ అని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ గీతాన్ని అవమానించిన ఎమ్మెల్యే తీరుపై ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు. ఏది ఏమైనప్పటికి సాధారణ ప్రజలకు దేశభక్తి గురించి భోదించాల్సిన ప్రజా ప్రథినిది ఇలా చేయటం సిగ్గుచేటు.