ఒక సినిమాలో తనికెళ్ళ భరణి ఒక గమ్మత్తైన కవిత రాస్తాడు. నా చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని. అప్పట్లో ఆ కవిత మనందరినీ తెగ నవ్వించింది. కానీ, ఇప్పుడు ఒక ప్రేమ జంట అలాగే మళ్ళీ మళ్ళీ నాలుగు సార్లు పెళ్ళాడారట. పెళ్లి అంటే ఎవరైనా ఒక్కసారి చేస్కుంటారు. వీల్లేంటి 4 సార్లు చేసుకోవాల్సిన అవసరమేమొచ్చింది అనుకుంటున్నారా? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. అబ్బాయి పేరు ఫయాజ్. అమ్మాయి పేరు అంకిత. ఇద్దరూ ఇండోర్లోని ఐఐఎంలో కలిసి చదువుకున్నారు. అప్పుడే చూపులు కలిసాయి, మనసులు ఒక్కటయ్యాయి. కానీ, చదువైపోయి ఉద్యోగంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. వాళ్ళు అనుకున్న విధంగానే చదువు పూర్తవగానే ఇద్దరికీ మంచి ఉద్యోగాలూ వచ్చేశాయి.
ఎలాగు లైఫ్ లో సెటిల్ అవుతాం కాబట్టి తమ ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారు అనుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను కలిసి తమ ప్రేమ విషయం చెప్పారు. కానీ, ఇరు పక్షాలూ వీరి పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో ఇక తప్పక స్నేహితుల సహకారంతో పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఫిబ్రవరి 18న పెళ్లి చేసుకునేందుకు అంకిత, ఫయాజ్ లిద్దరూ నిర్ణయించుకున్నారు. కానీ, ఆ రోజున వారి జాతకం ప్రకారం బాగా లేదని, అంకిత తల్లి చెప్పడంతో ఒక రోజుముందే అంటే ఫిబ్రవరి 17 న మహాశివరాత్రి రోజున వారిద్దరూ ఒక శివాలయం లో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. తరువాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎలాగు పెళ్లైంది కాబట్టి ఈ సారైనా వారి తల్లిదండ్రులు వచ్చి ఆశిర్వదిస్తారనుకున్నారు. కానీ, వారు రాలేదు. ఇక చేసేదేం లేక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. పనిలోపని మరోసారి స్నేహితుల సమక్షంలో హిందూ, ముస్లిం సాంప్రదాయ పద్ధతిల్లో రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. ఇలా మొత్తం 4 సార్లు పెళ్లాడారు ఈ జంట.
మొత్తానికి స్నేహితులు, సన్నిహితుల ఆశీర్వాదంతో కొత్త జీవితం ప్రారంభించారు. ఇలా నాలుగు సార్లు పెళ్ళాడిన వీరి జంటకు ఇప్పుడు 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంతకాలానికి రెండు కుటుంబాల్లో మార్పు వచ్చింది. ఇరు కుటుంబాలు కలిసి అంకిత, ఫయాజ్ల ప్రేమని, పెళ్లినీ అంగీకరించారు. దీంతో అంకితా ఫయాజ్ ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకా నయం ఇరు పక్షాలు ఒప్పుకున్నాయన్న ఆనందం లో మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఏదేమైనా ఈ జంట అనుకున్న విధంగా ఉద్యోగం, పెళ్లి మరియు పెద్దల అంగీకారం అన్ని జరిగిపోయి సంతోషంగా ఉంటున్నారు.