“భారత దేశంలో మతాల గొడవలుంటాయి”,”మనుషుల మద్య వేరు వేరు మతాలుండటం వల్ల వారి మధ్య సఖ్యత ఉండదు”, “హిందువుల మీద ముస్లిం లూ ముస్లిం లమీద హిందువులూ. ఎప్పుడూ దాడులు చేస్తూంటారు”. ఎప్పుడూ భారత దేశాన్ని సందర్శించని విదేశీయులే కదు ఇదే దేశం లో ఉండే కొందరి అభిప్రాయం కూడా ఇదే. పని గట్టుకొని మరీ దేశ విభజన కాలం నాటి హిందువుల ఊచకోతనీ,ప్రతీకారంగా ముస్లింలపై దాడులనీ ఎత్తిచూపేవారు కొందరైతే, అవే సంఘటన ఆధారంగా అధికారం కోసం గుజరాత్,ముజఫర్ నగర్ దాడులకు తెగబడేలా ప్రజలని రెచ్చగొట్టే వారు కొందరు. ఐతే నిజంగా భారత దేశంలో అంతటి పరిస్థితి ఉందా..? ప్రతీ ముస్లిం దేశంలో అరాచకాలు సృష్తించాలనే చూస్తాడా..? ప్రతీ హిందువూ తన సాటి పౌరుడైన ముస్లింని దేశం నుంచి వెళ్ళగొట్టాలనే చూస్తాడా? లేదేమో మనిషి మనిషి కీ మధ్య మతాన్నీ కులాన్నీ మించిన ఇంకేదో మనిషితనం ఇద్దరి మధ్యా ఉంటుందనే విషయాన్ని నిరూపించేందుకు,భారత దేశ లౌకిక భావనా ఔన్నత్యాన్ని చాటేందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.
పండిట్లకీ,స్థానిక ముస్లింలకీ మధ్య పచ్చగడ్డి భగ్గుమనే కశ్మీర్ లోయలో ఓ ఘటన భారతీయ మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది. నా అన్న వాళ్లు ఎవరూలేని ఓ కశ్మీరీ పండిట్ మృతిచెందితే. గ్రామంలోని ముస్లింలందరూ కలిసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.అదీ తమ మత విశ్వాసాలని పక్కన పెట్టి మరీ అతని ఆచార నియమాల ప్రకారమే అన్నీ నిర్వహించారు. పరమతాన్ని గౌరవించడమే అసలు మతమని పేర్కొంటూ వారంతా కలిసికట్టుగా తరలివచ్చారు. “ఎక్కడైనా మనిషి పోరాడేది నిజానికి తన అస్తిత్వం కోసమే, మతమూ లేదా జాతీ అనేవి కేవలం మనం చెప్పుకునే కారణాలు మాత్రమే” అన్న మాటలను నిజం చేయటానికా అన్నట్టు ప్రతీ ఇంటి నుంచీ ఒక మనిషిగా అతని అంత్యక్రియలకు హాజరై పాడె మోసారు.
కుల్గాం జిల్లాలోని మల్వాన్ గ్రామంలో జానకీనాథ్ (84)అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. 90దశకంలో మిలిటెన్సీ భయంతో ఆయన కుటుంబసభ్యులంతా వలసపోయినా. జానకీనాథ్ మాత్రం ఊరు విడిచి వెళ్లలేదు.ఒక్క ముస్లిం కూడా ఆయన మీద దాడీ చేయలేదు. అప్పటి పరిస్థితుల్లో భయాందోళనలకు గురైన పండిట్ లు వెళ్ళీపోయారు. అదే ప్రభావం లో ఉన్న ముస్లింలూ వాళ్ళు వెళ్ళటమే మంచిదనుకున్నారు. కానీ సాటి వారిపై ఉండే ప్రేమ మాత్రం ఎక్కడో మనసులోతుల్లోనే ఉండిపోతుంది కదా. 5వేల మంది ముస్లిం జనాభా ఉన్న ఆ గ్రామంలో ఒకే ఒక్క కశ్మీరీ పండిట్ జానకీనాథ్ కి అందరూ సహకరించారు. అతని అవసరాల్లో ఆదుకున్నారు. అతన్ని తమ “అన్న” గా పిలిస్తూ గౌరవించారు.ఐదేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న జానకీనాథ్కు ఇరుగుపొరుగు వారే సపర్యలు చేసారు. కాగా, సోమవారం ఆయన అనారోగ్యంతో మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఆచూకీ తెలియకపోవడంతో తమ అన్న కోసం ఆ గ్రామంలోని గ్రామస్థులంతా కదిలి వచ్చి.దగ్గరలోని ఊరి నుంచి బ్రాహ్మణులని పిలిచి మరీ కశ్మీరీ పండిట్ల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇది భారతదేశం ఇక్కడ మనుషుల్లో ఇంకా మానవత్వం చచ్చిపోలేదు అని నిరూపించారు.