కులం, మతం అనేవి పదాలు మాత్రమే… ఈ పదాలనీ చెప్పుకుంటూ చాలా మంది వారి జేబులు నింపుకుంటున్నారు. ఇప్పుడున్న ఈ దునియాలో ఒక కులాన్ని మరో కులం దగ్గరికి రానివ్వటం లేదు. ఒక మతం మరో మతాన్ని దగ్గరికి రానివ్వటం లేదు . ఈ ప్రపంచంలో అందరూ మనుషులు మతం కోసం కాకుండా మానవత్వం చూపించడంలో ముందు ఉంటే ఈ మత ఘర్షణలు, మత కల్లోలాలు ఉండవు కదా ! అని చాలాసార్లు అనుకునే ఉంటారు అందరూ.
కానీ కొందరు మతం వేరైనా వారిలో మానవత్వం ఉండి ఇతర మతాల వారికి సహాయం చేస్తుంటారు. అలాంటి సంఘటననే మహారాష్ట్రలోని ముంబ్రా ప్రాంతంలో జరిగింది. హిందూ మతానికి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు. అతనికి ఉన్నది ఒక ఆడతోడు మాత్రమే. తన భర్త చనిపోయిన విషయం చుట్టూ పక్కల వారికీ చెప్పింది కానీ ఆ ప్రాంతమంతా ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఏదైనా సహాయం చేస్తాం అంటే హిందూ, ముస్లిం ఆచార వ్యవహారాలు బిన్నంగా ఉంటాయి.
మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి అనుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన కొందరు ముస్లిం యువకులు హిందూ పద్దతిలోనే చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. అందరూ కలసి తలో ఒక చేయి వేసి అన్ని సమకూర్చారు. ఇక శవాన్ని ఎత్తే సమయంలో తలగోరివి పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు అనుకుంటే దానికి కూడా ఒక ముస్లిం యువకుడే ముందుకు రావడంతో అందరూ కలసి హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపించి మానవత్వానికి మతం అడ్డు కాదు అని నిరూపించారు.
ఈ విషయం క్షణంలో అందరికి తెలిసిపోయింది చివరకు ముంబ్రా ఎమ్మెల్యే జితేంద్రకు కూడా తెలియడం తో వారు చేసిన మంచి పనిని మెచ్చుకొని వారికి సెల్యూట్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఈ మతాల కోసం కుమ్ములాడుకునే పరిస్థితులలో కూడా ఇంకా మానవత్వం అనేది ఉంది అని నిరూపించారు ఆ యువకులు. మనం మన చిన్నారులకు నేర్పించేది మత సంప్రాదయాలను కాదు మానవత్వం యొక్క గొప్పతనం తెలియజేయాలి.