తెలుగింటి ఆడపడుచు శ్రీదేవి మరణం మన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని కూడా తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసింది. నెల రోజుల క్రితం వరకు కూతురు జాహ్నవి మొదటి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న శ్రీదేవి మేనల్లుడి వివాహవేడుకలకు దుబాయ్ వెళ్లి అక్కడ మరణించడం హఠాత్పరిణామం. ఆమె మరణం పలు అనుమానాలకు తావివ్వడం శోచనీయం. ఫిబ్రవరి 24న మరణించిన ఆమె మృతదేహం ఇప్పటివరకు భారత్ చేరకపోవడం, పోస్టుమార్టం మరియు ఫోరెన్సిక్ రిపోర్ట్ లలో ఆమె మృతి పై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. అలనాటి సావిత్రి నుండి నేటి శ్రీదేవి వరకు రంగుల ప్రపంచం లో మనందరిని అలరిస్తూ మనచే ఆరాధింపబడి, యుక్త వయసులోనే అనుమానాస్పదంగా మరణించారు. అలాగే సౌందర్య, దివ్యభారతి, ఆర్తి అగర్వాల్ ల మరణాలు ఇప్పటికి మిస్టరీగానే మిగిలాయి.
సావిత్రి
తన కళ్ళతోనే హావభావాలు పలికించగల గొప్ప నటీమణి. ఆమె స్థానం ఇప్పటికీ ఎవరు పూర్తిచేయనిది. ఆమె నటించిన మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ ఇప్పటికి ప్రజాదరణ పొందుతున్న మేటి చిత్రాలు. జెమిని గణేశన్ తో ఆమె వైవాహిక జీవితం ఆరంభించింది. ఆమె వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు. ఒకప్పుడు మహారాణిలా బ్రతికి, చివరకు తాగుడుకు బానిసై అతి దీనావస్థలో చనిపోయింది. చనిపోయేనాటికి ఆమె వయస్సు కేవలం 47 సంవత్సరాలే.
సౌందర్య
తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో తనదైన మార్క్ యాక్టింగ్ తో ఎంతోమంది మనసు చూరగొన్నది. పుట్టి పెరిగినది కర్ణాటక లోనైనా తాను చేసిన చిత్రాలు ఆమెని మన ప్రేక్షకులు తెలుగింటి ఆడపడచుగా ఆదరించారు. వెంకటేశ్, చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్లతో తెలుగు, తమిళ భాషల్లో నటించారు.2004 ఎన్నికల్లో బీజేపీ తరఫున మద్దతుగా ప్రచారం చేసేందుకు బెంగళూరు నుంచి వస్తుండగా హెలికాఫ్టర్ ప్రమాదంలో అతి పిన్న వయస్సులో దుర్మరణం పాలయ్యారు.
దివ్యభారతి
అతి చిన్నవయస్సులోనే తెరంగేట్రం చేసింది. తన అందచందాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్నది. తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో హిట్లు ఇచ్చింది. తెలుగులో చేస్తున్న తొలిముద్దు సినిమా మధ్యలో ఉండగానే, ముంబాయిలో తన అపార్ట్మెంట్ పైనుండి కిందపడి మరణించింది. ఆమె మరణం కూడా అనుమానాస్పదమే! ఎవరో తోసేశారని, మద్యంమత్తులో పడినదని, ఆత్మహత్య చేసుకుందని పలు వదంతులు వ్యాపించాయి. మరణించే నాటికి ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు.
ఆర్తి అగర్వాల్
తెలుగులో తన మొదటిసినిమా నువ్వు నాకు నచ్చావ్ తో కుర్రాళ్ళ మది దోచింది. తరవాతి సినిమాలైన నువ్వు లేక నేను లేను, ఇంద్ర, నీస్నేహం వంటి హిట్లు ఇచ్చింది. బాలీవుడ్ లో ఒక ఆల్బమ్ తో ఎంట్రీ ఇచ్చి పాగల్ పన్ అనే సినిమా చేసింది. తన స్టార్ డమ్ బాగా ఉన్నరోజుల్లోనే సూసైడ్ కి ప్రయత్నించింది. తరవాత వెండితెరకు కొంత విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి గోరింటాకు, అందాల రాముడు లాంటి మరిన్ని చిత్రాలు చేసింది. లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకుంటూ ఉండగా అది వికటించడంతో మృతిచెందింది. ఇలా వెండితెరపై తళుక్కుమన్న తారల మరణాలు అర్దాంతరంగా మిస్టరీలుగా ముగియడం అత్యంత శోచనీయం.
తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.