ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చలో గర్భిణీలకు రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం, గర్భంతో ఉన్నప్పుడు మహిళలు పనులు చేసుకునే వీలుండదు కాబట్టి ఆ సమయంలో వారు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది, రూ.15 వేలని మూడు విడుతలలో ఇవ్వనున్నట్లు తెలిపారు.
గర్భిణీలకు మూడోనెల తరువాత ప్రసవం వరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడానికి తొలివిడతగా రూ.5వేలు, ప్రసవం పూర్తికాగానే రెండో విడతగా రూ.5 వేలు, ఆ తర్వాత బేబీ ఇమ్యూనైజేషన్ (పూర్తి స్థాయిలో టీకాలు)కు రూ. 5వేలు చొప్పున మొత్తంగా రూ. 15 వేలు ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం, దీనికోసం ఎంత బడ్జెట్ అవసరం అవుతుందో నిర్ణయించడానికి ఒక కమిటీని నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు.
తమిళనాడులో ముత్తులక్ష్మీరెడ్డి బెనిఫిట్ స్కీమ్ పేరిట గర్భిణీలకు రూ.12 వేలు ఇస్తున్నారు, ఆ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకోని మన రాష్ట్రంలో గర్భిణీ మహిళలకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు, దానితో పాటు తమిళనాడులో అప్పుడే పుట్టిన శిశువుకి కావాల్సిన 16 వస్తువులని అమ్మ కిట్ పేరుతో తల్లికి అందజేస్తున్నారు, ఈ పథకాన్ని కూడా తెలంగాణలో అమలు చేయాలనీ ఆలోచిస్తున్నట్లు తెలిపారు, ఈ బేబీకిట్లో బేబీ ఆయిల్, బేబీ పౌడర్, మస్కిటో కిట్, చిన్న బెడ్తో పాటు నవజాత శిశువులకు అవసరమయ్యే దాదాపు 30 వరకు వస్తువులుండేలా చర్యలు తీసుకుంటున్నారు ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి.