భారత న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఎంత నమ్మకం ఉందో,తమదేశం పౌరులైన తమ రక్షణ కోసం ఎంత ఆరాట పడుతుందో రుజువు చేసే సంఘటనలని మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ముందు ఒక టెర్ర రిస్టుని ఉరి తీయటమో.ఉగ్రవాదుల రాక మీద ఉన్న అనుమానాలను పెరగనివ్వకుండా అక్కడ మరణించిన పోలీసుల హత్యలని హైలేట్ చేసి ఆఖరికి వారి చావుకి కారణాల మీద ఉన్న ప్రశ్నలని బయటకు రాకుండా చేయటం కోసం తాపత్రయ పడే రాజకీయ పార్టీ ప్రభుత్వాల పనితీరునీ నిత్యం చూస్తూనే ఉన్నాం. ఒక్క ఆడపిల్ల దేశ రాజధానిలోనే అత్యంత కౄరంగా హింసించబడి మరణిస్తే ఆ కారకులను శిక్షించేందుకు ఎన్ని రోజులు పట్టిందో మనందరం చూసాం.ఇప్పుడు మరో సారి మనదేశ అత్యున్నత పారదర్శక న్యాయవ్యవస్థ తీర్పుని చూడబోతోంది భారత పౌర సమాజం.
2012 లో నిర్భయ ఘటన దేశమే కాదు దాదాపు ప్రపంచమే ఈ సంఘటన పట్ల తీవ్ర వేదన పడింది. ఆ నిందితులని అప్పటికప్పుడు చంపేయాలంటూ మండిపడ్డారు ప్రజలు,యువతరం అంతా ఒక్కతాటి మీదకొచ్చి రోడ్లమీద నిరసన ప్రదర్శనలతో ప్రభుత్వాన్నే వణికిపోయేలా చేసారు. ప్రభుత్వం వేగంగా స్పందించింది నిందుతులు తామే దోషులమని ఒప్పుకున్నాక కూడా కొన్ని నెలల “స్వల్ప”కాలం లోనే విచారణ పూర్తి చేసి తీర్పునిచ్చింది న్యాయస్థానం ఈ పాపానికి పాల్పడ్డ ఆరుగురిలో నలుగురికి కోర్టు ఉరి శిక్ష విధించింది. మరొకరు పోలీస్ కస్టడీలోనే మృతి చెందాడు. ఆరో వ్యక్తికి మైనార్టీ తీరకపోవడంతో అతనికి జూవనైల్ యాక్ట్ ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించి జూవనైల్ హోం కు తరలించారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా నిర్భయ చట్టం తెచ్చింది.పరిస్థితి ఎప్పటి లాగే ఉంది ఈ రెండేళ్ళలో కొన్ని వందల మంది ఆడపిల్లలూ,చిన్న పిల్లలూ అత్యా చారానికీ,హత్యలకూ గురయ్యారు…
ౠజువర్తన కలిగి ఉండటం అంటే రోజుకి ఐదుసార్లు నమాజు చేయటం,రంజాన్ మాసం లో ఉపవాసం ఉండటం,లేదా రోజూ బొట్టు పెట్టుకొని సంద్య వార్చటం అనుకునే దేశం లో అతని మత విధానాన్ని ఆచరించటం చాలా మందికి సత్ప్రవర్తన కింద కనిపించింది. ఈ డిసెంబర్ 20న అతన్ని విడుదల చేయనున్నారు. అంతే కాదు ఎంతో సహృదయత కలిగిన ఈ దేశ ప్రజా ప్రభుత్వం విడుదల అనంతరం ఆ బాలనేరస్థుడికి ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు పదివేల రూపాయల ఆర్ధిక సాయం, ఒక కుట్టు మిషనూ పెట్టుకునేందుకు ఢిల్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ అతనికి పునరావాసం కల్పించనుంది. ప్రస్తుతం అతని వయస్సు 21 సంవత్సరాలు. ఢిల్లీ హైకోర్టు బాంబు పేలుళ్ల నిందితుడు అతన్ని ప్రేరేపించాడని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడైన నేపథ్యంలో అతనిపై ఎన్ఎస్ఏ (జాతీయ భద్రతా చట్టం) ప్రయోగించాలనీ,అతన్ని బయటికి వదలటం ప్రమాదకరమేమో అని పోలీసులంటున్నారు.
మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు అతని విడుదలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అతని విడుదలను ఆపేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖతో పాటు, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరగా జాతీయ మానవహక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించారు. ‘ఇప్పుడు పోలీసులు ఆలోచించడం కాదు చర్యలకు ఉపక్రమించాలి’ అని నిర్భయ తండ్రి బద్రినాథ్ మీడియాకు తెలిపారు. నేరగాళ్లకు ఎలాంటి హక్కులు ఉండరాదని పేర్కొన్నాడు. గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన సమయంలో ఆ నేరస్తుడి వయస్సు 18 సంవత్సరాలకు కొన్ని నెలలు మాత్రమే తక్కవ. అయితే నిర్భయపై జరిగిన అమానుష హింసలోఇతని పాత్రే ఎక్కువ అని తన మరణానికి ముందు వాగ్మూలం లో నిర్భయ చెప్పింది కూడా. కాబట్టి అతన్ని కూడా మిగతా నిందితుల మాదిరిగానే పరిగణిస్తూ.. కఠిన శిక్ష విధించాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు.