ఒక మనిషి చేసిన త్యాగం కొన్ని వందల మందిలో మార్పు తీసుకొచ్చింది. చనిపోతూ కూడా తనని బతికించమని కాకుండా తొందరగా నా శరీరం లో పనికి వచ్చే శరీర భాగాలని అవసరం అయిన వారికి అమర్చమని చెప్పిన ఆ మనిషినే ఆదర్శంగా తీసుకున్న ఆ గ్రామస్తులు ఒకే రోజు తమ కళ్ళని దానం చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాదు అందుకు అవసరం అయిన పత్రాలను నింపటంతో ఆగకుండా సమీప గ్రామాల్లోని తమ బందువులను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు…
కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా కరేగౌడనహళ్ళి సమీపంలోని బెళవత గ్రామంలోని మొత్తం 180 మంది తమ నేత్రాలను మరణానంతర దానం చేస్తున్నట్లు ప్రకటించారు. నేత్ర దానానికి ముందుకొచ్చినవారిలో పిల్లలు కూడా ఉండటం విశేషం. బెళవత గ్రామస్తులు నారాయణ నేత్రాలయ ఆసుపత్రికి డిక్లరేషన్లను సమర్పించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వీరిలో ఈ స్ఫూర్తిని నింపిన ఘనత ఇటీవల మృతి చెందిన యువకుడు హరీశ్కే దక్కుతుంది.
హరీష్ ఎవరంటే….నెలరోజులక్రితం కరేగౌడన హళ్ళి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెంగుళూరు నుంచి వచ్చిన హరీష్. వోటు వేసిన అనంతరం స్వగ్రామం నుంచి బెంగళూరుకు తిరిగొస్తుండగా.. జాతీయ రహదారి4 పై ఉన్న తిప్పగొండనహళ్లి అనే గ్రామం వద్ద పంచాదార బస్తాలతో వస్తున్న ఓ లారీ.. పల్సర్ పై వెళుతున్న హరీశ్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. దీంతో అతడు లారీ టైర్ల కింద పడిపోయాడు. అలా పడిపోగానే అతడి దేహం రెండు ముక్కలుగా విడిపోవడంతోపాటు నడుము నుంచి కాళ్ల వరకు ఉన్న భాగాన్ని లారీ కొన్ని అడుగుల మేర ఈడ్చుకెళ్లింది. తలతో ఉన్న మొండెం భాగం మరోచోట పడిపోయింది. అతడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణం పోతున్న ఆ కొద్ది ఘడియల్లోనే రోడ్డుపై వెళ్లేవారిని దగ్గరకు పిలిచి తన అవయవాల్లో ఏది పనికొస్తే అది దానం చేయాల్సిందిగా కోరాడు. ఈలోగా స్థానికులు రెండుగా విడిపోయిన అతడి శరీర భాగాలను ఓచోట చేర్చి ఆస్పత్రికి తరలించారు. కానీ కాసేపట్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటి ఘోర రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర బాధాకరమైన పరిస్థితుల మధ్య కూడా హరీశ్ కి క్షణాల్లో తన అవయవాలు దానం చేయాలన్న ఆలోచన రావడం మామూలు విషయం కాదనీ, అతన్ని చూసిన ఆసుపత్రి వైద్యులు సైతం కంటతడి పెట్టుకున్నారట…
ఈ మాటలని విన్న హరీష్ గ్రామస్తులు అతన్ని స్పూర్థి గా తీసుకొని సామూహిక అవయవ దాన శిబిరం ఏర్పాటు చేసి మరీ తమ కళ్ళని దానం చేసారు. నేత్రదాన డిక్లరేషన్ ఇచ్చినవారిలో పిల్లలు కూడా ఉన్నారు. నేత్ర దానం అనంతరం ఇదే స్పూర్థిని తామూ కొనసాగిస్తామని. హరీష్ త్యాగమే తమ ఆదర్షం అంటూ ప్రతిఙ్ఞ చేసారు.. తన మరణం తో ముగ్గురిని బతికించటమే కాదు. ఇంతమందిలో చైతన్యం న్రగిలించిన హరీష్ నిజంగా అమరుడు…