Home / Inspiring Stories / పాక్ లో ‘అండర్ కవర్ కాప్’…దేశభద్రత వ్యూహాల్లో ఎప్పటికీ టాప్ !

పాక్ లో ‘అండర్ కవర్ కాప్’…దేశభద్రత వ్యూహాల్లో ఎప్పటికీ టాప్ !

Author:

Indian James Bond Ajit Doval

దేశ సరిహద్దులు దాటి ఉగ్రవాదులను మట్టుబెట్టే దూకుడు..పాక్‌-భారత్‌ సరిహద్దుల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి. అతనే భారత జాతీయ భద్రత సలహాదారు, ఇండియన్‌ జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ కుమార్‌ డోవల్‌. ఐబీ డైరెక్టర్‌గా పని చేసిన దోవల్‌ అపర చాణక్యుడిగా పేరొందారు. డోవల్‌ పేరు భారత్‌ కన్నా పాక్‌లోనే సుపరిచితం. భారత జాతీయ భద్రత సలహాదారుగా ఆయన ఎంపికైనప్పుడు ‘పాక్‌ను విచ్ఛిన్నం చేయడానికి నియమితుడైన భారతీయుడు’ అంటూ పాక్ పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించాయి. దోవల్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ అయిన దావూద్‌ ఇబ్రహీం పాక్‌ నుంచి ఆఫ్ఘన్‌కు మకాం మార్చాడు. పాక ఆక్రమిత కాశ్మీర్ లో భారత అనుకూల ఉద్యమాలు మొలైయాయి. పంజాబ్‌, మిజోరం, కశ్మీర్‌లలో గూఢచారిగా ఉగ్రవాదుల నుంచి అనేక సార్లు దేశాన్ని రక్షించిన ఘనత ఆయన సొంతం. పాక్‌లోనూ ఏడేళ్లు అండర్‌ కవర్‌ గూఢచారిగా ఆయన పనిచేశారు. మోదీకి దోవల్‌ సన్నిహితుడు. సంఘ్‌ మేధోవర్గంలో ఒకరుగా ముద్రపడిన దోవల్‌ మోదీకి అత్యంత ప్రీతి పాత్రుడయ్యారు. పాక్‌ ఉగ్రవాదుల గుండెల్లో డెవిల్‌గా ముద్రపడిన దోవల్‌ సైనికులకు మాత్రమే దక్కే కీర్తిచక్ర అవార్డు పొందిన తొలి ఐపీఎస్‌ అధికారి. శ్రీలంక ఎన్నికల్లో మహింద రాజపక్షే ఓటమి వెనుక దోవల్‌ చాణక్యనీతి ఎంతో ఉంది. ‘‘నాకు దేశమే ముఖ్యం.. దేశం కోసం అవసరమైతే హింసను ఆశ్రయించడంలో తప్పులేదు’’ ఇదీ దోవల్‌ సిద్ధాంతం. అయన ప్రతి భారతీయునికి ఆదర్శమూర్తి కావాలి.

Ajit Doval and Modi

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరు చెబితే పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండు దేశాల భద్రతా సలహాదారుల మధ్య న్యూఢిల్లీలో ఇటీవల చర్చలు జరగాల్సి ఉన్నా పాకిస్థాన్ ముందుకు రాకపోవడానికి అజిత్ దోవల్ అనే బూచి కారణమని తెలిసింది. ఆయన పేరు వింటేనే పాకిస్థాన్‌ పాలకులకు వణుకు పుడుతోంది. సరిగ్గా ఈ భయం కారణంగానే చర్చలకు పాక్ వెనకడుగు వేసింది. పాక్ భద్రతా సలహాదారు సర్తార్ అజీజ్ వృద్ధ మాంత్రికుడే అయినా అపర చాణక్యుడైన దోవల్‌‌ స్థాయికి సర్తార్ సరిపోడని పాక్ పాలకుల గట్టి నమ్మకం. అజిత్ ముందు సర్తార్ పప్పులుడకవని గ్రహించిన పాక్ పాలకులు గేమ్ చేంజ్ చేశారు. కాశ్మీర్, హురియత్ అంటూ నాటకాలాడి చివరకు చర్చల నుంచి వైదొలిగారు. అజిత్ దోవల్‌తో డీల్ చేయడం అంటే తమాషా కాదని, ఈ పని చేయగల సామర్థ్యం సర్తార్ అజీజ్‌లో లేదనే వారు చర్చలకు గుడ్‌బై చెప్పారు. పాక్ మీడియాలో కూడా రోజూ అజిత్ దోవల్ వార్తలే వస్తున్నాయి. దోవల్ ఆవులిస్తే పేగులు లెక్కపెడతాడంటూ పాక్ టీవీ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అజిత్ దోవల్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే శతృదేశాలకు వెన్నులో వణుకు పుట్టడం సహజమే అనిపిస్తుంది. మోడీకి అత్యంత విశ్వసనీయుడైన దోవల్‌ భారత ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. కీర్తి చక్ర అవార్డు దక్కించుకున్న అరుదైన పోలీస్ ఆఫీసర్. 1980 నుంచీ భారత్‌లో భద్రతా చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. పాకిస్థానీ ముస్లిం పౌరుడిలా ఆయన పాక్‌లో ఏడు సంవత్సరాలు గడిపారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు, ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఉన్న అనుబంధాన్ని అతి దగ్గరగా చూశారు. కీలక సమాచారాలన్నీ రాబట్టారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ అయినప్పుడు హైజాకర్లతో మాట్లాడింది దోవలే. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఈయన అనుసరించిన వ్యూహాలెన్నో విజయవంతమయ్యాయి. దోవల్‌కు శతృ దేశాలను మతిభ్రమింప చేసే వ్యూహాలు అమలు చేయగల నేర్పుందని అనేకసార్లు నిరూపణ అయింది.

ajit-doval in Pakisthan

ఉత్తరాఖండ్‌లో 1945లో పుట్టిన దోవల్ అజ్మీర్ మిలటరీ స్కూల్‌లో చదివారు. ఆయన తండ్రి కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో ఎంఏ చేశాక 1968లో కేరళ క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. సర్వీస్‌లో చేరిన ఆరేళ్లకే పోలీస్ మెడల్ సంపాదించారు. వాస్తవానికి ఈ మెడల్ సంపాదించాలంటే 17 ఏళ్ల సర్వీస్ ఉండాలి. కాశ్మీర్, మిజోరం, పంజాబ్‌లో ఉగ్రవాద నిర్మూలన చర్యలు చేపట్టారు. సిక్కుల స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ విజయవంతంలో దోవల్‌ది కీలక పాత్ర. 1990 నుంచి 1996 వరకూ దోవల్ ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్‌లో పనిచేశారు. 1996లో లండన్‌లోని భారత హై కమిషన్‌లో కూడా పనిచేశారు. ఇంటలిజెన్స్ బ్యూరో డైరక్టర్‌గా 2005లో రిటైరయ్యారు. 2009 నుంచీ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌కు ఫౌండర్ డైరక్టర్‌గా ఉన్నారు. 2014 మే 30న మోదీ ప్రభుత్వం దోవల్‌ను భారత జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది. 2014లో ఇరాక్ తిక్రిత్‌లో ఉగ్రవాదులు అపహరించుకుపోయిన 46 మంది భారత నర్సులను సురక్షితంగా విడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంత ఘన చరిత్ర ఉంది కాబట్టే పాకిస్థాన్ దోవల్‌తో చర్చలకు సర్తార్ అజీజ్‌ను పంపలేకపోయింది. అజిత్ దోవల్ లాంటి మరో సమర్థుడైన వ్యూహకర్త దొరికే వరకూ పాకిస్థాన్ ఇప్పట్లో భారత్‌తో చర్చలకు రాకపోవచ్చు.

(Visited 1,192 times, 1 visits today)