పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో తప్ప బయట కనపడడం అరుదు, కేవలం అయనకు నచ్చిన ఈవెంట్ లకు మాత్రమే అటెండ్ అవుతారు. అలాంటిది ఆయన మొదటిసారిగా ఒక తెలుగు అసోషియేషన్ వారు నిర్వహిస్తున్న కూచిపూడి ఉత్సవాల ముగింపు వేడుకకు హజరు కానున్నారు. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోషియేషన్ (యుక్తా), భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య (ఐసిసిఆర్), భారతీయ విద్యా భవన్, నెహ్రూ సెంటర్ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జయతే కూచిపూడి” పండుగ ముగింపు దశకు చేరుకుంది. 45 మంది కళాకారుల బృందం యూరప్ లోని ఇటలీ, ఫ్రాన్స్ జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ దేశాల్లో నెల రోజులపాటు కూచిపూడి, యక్షగానం, బతుకమ్మ నీరాజనం, తెలంగాణ జానపదం వంటి ప్రదర్శనలిచ్చి లండన్ నగరం చేరుకోనున్నారని యుక్తా అధికార ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 9వ తేదీన తూర్పు లండన్ లో ఉన్న ట్రాక్సీ థియేటర్ లో జరుగనున్న యుక్తా వార్షికోత్సవ వేడుకలలో ఈ బృందాన్ని ఘనంగా సన్మానించనున్నారు. ముఖ్య అతిథి గా ప్రఖ్యాత సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్ఛేయనున్నారు. రెండు వేల మంది ప్రవాస తెలుగు వారు వచ్ఛే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పవన్ మొదటి సారిగా లండన్ నగరానికి విచ్చేయనున్న సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసారు.