మదన్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు సాయికుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న ఆది తాజాగా ‘గరమ్’ అనే సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమాను సాయి కుమార్ తన సొంత బ్యానర్పై నిర్మించడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ను కొద్దిసేపటి క్రితం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఇక ఈ సందర్భంగా టీజర్ లాంచ్ చేసిన ప్రభాస్ సినిమా యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ.. “సాయికుమార్ గారి తనయుడు ఆది డ్యాన్సుల్లో, ఫైట్స్లో మంచి ప్రతిభ కనబరుస్తూ దూసుకుపోతున్నాడు అని తెలిపాడు. ఆది హీరోగా, మన సాయికుమార్ గారు మొదటి సారి నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమా పెద్ద హిట్గా నిలవాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇక సాయి కుమార్ మాట్లాడుతూ.. “బాహుబలి సినిమాతో మనందరికీ గర్వ కారణంగా నిలిచిన ప్రభాస్ టీజర్ని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది” అన్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో హీరో ఆది, దర్శకుడు మదన్ తదితరులు మాట్లాడారు.