ఎండాకాలం ప్రారంభం నుండే ఎండ ప్రతాపం రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుండే వేడి వాతావరణం కనపడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలి.
వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు:
.ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.
.ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి.
.పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
.రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.
.ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
.పలుచని బట్టలు వేయాలి.
.ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు వాడాలి.
.పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి.
వేసవిలో చర్మ సంరక్షణ:
.చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.
.అన్నింటికంటే ముందుగా చేయాల్సింది ఎక్కువ నీటిని తాగడం. సాధారణంగా మిగతా కాలాల్లో మీరు తీసుకుంటున్న నీటి కంటే రెండింతలు అధికంగా తీసుకోవాలి.
.తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది.
.ఐస్తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది.
వడదెబ్బ నివారణ:
.వేసవి కాలంలో డీ-హైడ్రేషన్ అధికంగా ఉంటుంది కావున వాటర్ బాటిల్’ను మీతో తీసుకెళ్ళండి.
.గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్’కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
.వేసవికాలంలో డోకులు, వాంతులు, అలసట, బలహీనంగా కనిపించటం, తలనొప్పి, కండరాలలో తిమ్మిరులు, మైకం వంటి లక్షణాలు బహిర్గతమైన వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
ఎండాకాలం పిల్లలు భద్రం:
.వాతావరణం వేడిగా వుంటే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా వుటుంది. అందుకని వడదెబ్బ తగిలే అవకాశం వారిలో ఎక్కువ.
.నీళ్ళు, ఇతర ద్రవాలు తాగకుండా మొరాయించే పిల్లలు ఎండలో తొందరగా నీరసించిపోతారు. ఆరుబయట ఎండలో ఎక్కువసేపు తిరిగినా, ఆడినా చెమట ద్వారా లవణాలు కోల్పోయి నీరసించిపోతారు.
.పిల్లల వంట్లో నీరు వేగంగా ఆవిరైతుంది. కావున పిల్లలను బయట ఉండనివ్వద్దు.
శరీరం ఎండ ప్రభావానికి గురికాకుండా ఉండాలంటే తేలికగా జీర్ణమయ్యే సమతులాహారం తీసుకోవాలి. ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. చర్మం ఆరోగ్యంగా ఉండటం కోసం తాజా పళ్లు, ఆకుపచ్చని కూరగాయలు ఆహారంలో చేర్చాలి. కాకర కాయ, బచ్చలి కూర, దోసకాయ, పుచ్చకాయ, చెర్రీ పళ్లు ఎక్కువగా తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తినటం వల్ల శరీరంలో నీటి పరిమాణం స్థిరంగా ఉండి ఎండ దెబ్బకు గురి కాకుండా ఉంటారు.