ఇది నిజంగా శుభవార్తే. పంజాబ్ లో ఆడపిల్లలకు పూర్తిగా ఉచిత విద్యను అందించనున్నట్టు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేసారు. నర్సరీ నుంచి పీ.హెచ్.డీ దాకా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలు, మహిళలకు మొత్తం అంతా ఉచితంగా అందించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతే కాదు, మొత్తం పాఠ్య పుస్తకాలు కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర గవర్నర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ సాగిన ఒక ప్రసంగం లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వ నర్సరీ, ఎల్కేజీ విద్యనూ మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు.
ఎన్నికల సమయంలో తానూ మేనిఫెస్టోలో చెప్పినట్టు మహిళల సాదికరతకు ఈ చర్యతో బీజం పడ్డట్టు అభివర్ణించుకున్నారు సీఎం అమరీందర్ సింగ్. ఇప్పటికే పంజాబ్ లో పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లోని మహిళల రిజర్వేషన్లను కూడా 33శాతం నుంచి 50శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
అయితే ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను కూడా ప్రారంభిస్తామని సీఎం అమరీందర్ సింగ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే 13 వేల స్కూల్లల్లోనూ, 48 ప్రభుత్వ కాలేజీల్లోనూ ఫ్రీ వై ఫై కూడా అందిస్తామని హామీల్లో భాగంగా ప్రచారం చేశారు. వీటితో పాటూ.. తాను హామీ ఇచ్చిన అనేక వరాలను కూడా త్వరలోనే పంజాబ్ ప్రజలకు అందిస్తే మాత్రం దేశం లోనే సుపరిపాలన అందించే ముఖ్యమంత్రుల్లో ఒకరిగా మిగిలిపోతారు సీఎం అమరీందర్ సింగ్. ఎన్నికలప్పుడు గెలుపు కోసం ఎన్ని హామీలు ఇచ్చినా, ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకోసం వారి శ్రేయస్సు కోసం పరిపాలిస్తూ నిర్ణయాలు తీసుకునేవాడే నిజమైన నాయకుడు.