కొత్త వంద రూపాయల నోటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు పొందిన గుజరాత్లోని చారిత్రక కట్టడం ‘రాణి కీ వావ్’ ఫొటో నోటు వెనుక భాగంలో ముద్రించారు. ఈ కొత్త వంద నోటు ఊదా రంగులో ఉంటుంది. ఈ కొత్త నోట్లు మెల్లగా బ్యాంకింగ్ వ్యవస్థను సామాన్య ప్రజానీకానికి చేరనున్నాయి.
ఈ నోటుపై 100ను దేవనాగరి లిపిలోనూ ముద్రించారు. నోటు మధ్యలో గాంధీ బొమ్మ ఉంటుంది. ఇక ఆర్బీఐ, హిందీలో భారత్ అని, ఇండియా, 100 అనే మైక్రో పదాలు కూడా ఉంటాయి. నోట మధ్యలో ఉన్న సెక్యూరిటీ థ్రెడ్పై కూడా హిందీలో భారత్, ఆర్బీఐ అన్న అక్షరాలు ఉంటాయి. నోటును మడిచినప్పుడల్లా థ్రెడ్ కలర్ ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది.ఈ నోటులో కొత్తగా కొన్ని మైక్రో సెక్యూరిటీ ఫీచర్లను చేర్చినట్లు ఆర్బీఐ వెల్లడించారు. ఈ ఫీచర్లు అతినీలలోహిత కాంతిలో మాత్రమే కనిపిస్తాయి. పాత వంద నోట్లు కూడా చెలామణీలో కొనసాగుతాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత చిల్లర కష్టాలను తీర్చేందుకు ఆర్బీఐ కొత్తగా రూ.200, రూ.10, రూ.50 నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.