పోయిన సంవత్సరం పాత 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి కొత్త 500, 2000 రూపాయల నోట్లు ప్రవేశపెట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే మరో కొత్త నోటు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే అది 10, 20, 50,100 నోటు కాదు, ఒక్క రుపాయి నోటు. ఇప్పటికే ఈ కొత్త రూపాయి నోట్లు ప్రింట్ అయ్యాయని, కాయినేజ్ చట్టం 2011 ప్రకారం ఈ నూతన రూపాయి నోట్లు త్వరలోనే అధికారికంగా చెలామణిలోకి వస్తాయని, అయితే ఇప్పటికే వాడుకలో ఉన్న పాత రూపాయి నోట్లు కూడా చెలామణిలోనే ఉంటాయని కూడా స్పష్టం చేసింది.
ఈ కొత్త రూపాయి నోటు గులాబీ(పింక్), ఆకుపచ్చ(గ్రీన్) కలర్లో ఉండగా, నోటు పైన దేవనాగిరి లిపిలో భారత సర్కార్ అని ఇంగ్లీషులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. కొత్త రూపాయి నాణెంపై ఉన్న రూపీ గుర్తు కూడా ఈ నోటుపై ఉందబోతోంది. నంబర్ ప్యానెల్లో ఇంగ్లీషు అక్షరం ఎల్ ఉంటుందని హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శి శక్తికాంత దాస్ సంతకం ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. అయితే రూపాయికి మార్కెట్ లో ఏమి దొరకని ఈ రోజుల్లో ఆర్బీఐ ఒక్క రూపాయి నోటు విడుదల చేయడం కొంత విడ్డూరంగానే ఉంది.