సాధారణంగా డాక్టర్లు ఉప్పూ, కారం తగ్గించుకుని తినటం మంచిదని సలహాలు ఇస్తుంటారు. కానీ, చప్పిడి తిండి తినే వారి కంటే కారం తినే వారే ఎక్కువ రోజులు బతికేస్తున్నారట. మిరపకాయలు తింటే ఆయుష్షును పెరుగుతుందని తాజా అధ్యయనాలు తేల్చాయి. కారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా అధికబరువు సమస్య నుంచి కొంతమేర తప్పించుకోవచ్చని పరిశోధనల్లో తేలింది. తాజాగా అమెరికాలో నిర్వహించిన పరిశోధనల్లో పండు మిరపకాయలు ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.
అమెరికాలో 16వేల మంది మీద సుమారు 23 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. ఈ మధ్య కాలంలో వారి ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య స్థితిని గమనించారు. పండుమిరపకాయలు ఎక్కువగా తినే వారిలో చాలా తక్కువ ఆరోగ్య సమస్యలు కనిపించగా, కారం తక్కువ తీసుకునే వారిలో గుండెపోటు వంటి సమస్యలను గుర్తించారు. కారం ఎక్కువ తినడం వలనే దీర్ఘాయుష్షు సాధ్యమన్న విషయాన్ని వీరు స్పష్టం చేయకపోయినా, కొన్నిరకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని పరిశోధకులు తెలిపారు. అయితే, గొడ్డు కారం తినమని ఎక్కడా చెప్పలేదు. తగిన మోతాదులు సాధారణంగా తీసుకునే కారం గురించే పరిశోధకులు తమ రీసెర్చ్ పేపర్స్లో ప్రస్తావించారు. మరణాల సంఖ్య కారం తినని వారితో పోల్చితే కారం తినే వారిలోనే తక్కువగా ఉందని స్టడీలో తేలిందట!