వస్తు సేవల పన్ను (GST) బిల్లు వ్యాపరస్తులను భయాందోళనలకు గురి చేస్తోంది. జులై నుంచి అమలుకానున్న కొత్త GST బిల్లులో పేర్కొన్న విధంగా 18శాతం పన్నుని తాము కట్టలేమని ప్రకటించింది తెలుగు రాష్ట్రాల హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం. కొత్త బిల్లుకు వ్యతిరేకంగా మంగళవారం (మే30) న తెలంగాణ,ఏపీ రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ చేస్తున్నామని, తక్షణమే 18శాతం పన్ను విధానాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే మరికొన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఆ సంఘం ప్రతినిదులు. రెండు రాష్ట్రాలలోని హోటళ్లు , రెస్టారెంట్లు కలిపి ప్రభుత్వానికి రూ.300కోట్ల పన్ను చెల్లిస్తున్నాయని, ఇప్పుడు దానిని పెంచితే ఆ భారం వినియోగదారులపై పడుతుందని తద్వారా తమ ఆదాయం తగ్గుతుందని వారు వాపోయారు. ఇప్పటికే వివిద రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దగ్గరే హోటళ్లు, రెస్టారెంట్లపై ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నారని మరల ఇప్పుడు GST పేరుతో పన్నులు ఇంకా పెంచితే సహించబోమన్నారు.
ఇదిలా ఉంటే దేశంలో ఉన్న అన్ని ఫార్మసీల యజమానులు తాము నిత్యం అమ్మే మందుల వివరాలను, పేషెంట్లు తెచ్చే ప్రిస్క్రిప్షన్లను, వారు కొనే మందుల బిల్స్ను రోజూ ప్రభుత్వ వెబ్సైట్లో ఎంటర్ చేయాలని తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెడికల్ షాపుల యజమానులు మంగళవారం (మే30) బంద్ పాటించనున్నారు. దానితో రేపు అన్ని మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ సదుపాయం లేనప్పుడు వెబ్సైట్ లో వివరాలు నమోదు చేయడం కష్టంగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల అత్యవసర సమయాల్లో మందులను విక్రయించడం కష్టతరమవుతుందని, తద్వారా ప్రజలకే ఇబ్బందులు కలుగుతాయని వాదిస్తున్నారు మెడికల్ షాపుల యజమానులు. అందుకే అత్యవసర మందులు కావాలంటే ఈరోజే తెచ్చుకోండి.