ఈజిప్టులో గల్లంతయిన రష్యా విమానం కూలిపోయినట్టు ఈజిప్టు ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఈ విమానాన్ని కూల్చివేసినట్టుగా భావిస్తున్నారు. ఐఎస్ఐఎస్ బలంగా ఉన్న సినాయ్ ప్రాంతంలో ఈ విమానం అదృశ్యమైంది. కాగా ఈ ఘటనపై భిన్న కథనాలు వెలువడ్డాయి. గల్లంతయిన విమానం సురక్షితంగా ఉన్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ విమానం కూలిపోయినట్టుగా ఈజిప్టు నిర్ధారించింది. దీనిపై ప్రధానమంత్రి షరీఫ్ ఇస్మాయిల్.. కేబినెట్ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విమానం కూలిపోయిన మాట వాస్తవమే గానీ దాన్ని ఎవరైనా కూల్చేశారా అన్న విషయాన్ని మాత్రం అప్పుడే నిర్ధారించలేమని అంటున్నారు.
కూలిపోయిన విమానంలో దాదాపు 217 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులలో 17 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది పర్యాటకులే ఉన్నారు. వీరిలో ఎవరి ఆచూకీ తెలియకపోవడంతో.. అంతా మరణించి ఉండొచ్చని చెబుతున్నారు. రష్యాకు చెందిన ఎయిర్ బస్ ఎ- 321 విమానం ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పం మీదుగా రష్యాకు బయల్దేరిన తర్వాత టేకాఫ్ తీసుకున్న 23 నిమిషాలకే ఈజిప్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరిధిలో దాని సిగ్నల్స్ అందలేదు. రష్యా విమానంపై ఐఎస్ఐఎస్ పంజా విసిరినట్టుగా భావిస్తున్నారు. రష్యాపై ఐఎస్ఐఎస్ ప్రతీకార దాడికి దిగినట్టు ఈజిప్టు భావిస్తోంది. విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు.
సాంకేతిక సమస్యలంటున్న రష్యా టీవీ
ఈ విమానం ఈజిప్టులోని షర్మ్- ఎ- షేక్ రిసార్టు నుంచి రష్యాకు బయల్దేరింది. అక్కడినుంచి బయల్దేరగానే సాంకేతిక సమస్యలు తలెత్తాయని, రిసార్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే దీన్ని పైలట్ గుర్తించారని రష్యా టీవీ వర్గాలు చెబుతున్నాయి. కైరోలో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారని, కానీ అటువైపు వెళ్తుండగానే సమస్య తీవ్రమైందని అన్నారు. సైప్రస్లోని లార్నా ప్రాంతంలో విమానం కూలిందని చెప్పారు.