మామూలుగా కాలినడకన వెళ్ళే నాలుగు అడుగులు దూరానికే కారెక్కి షికారు వెళ్ళాలనుకునే అధికారులకు మునిసిపల్ జాయింట్ కమీషనర్ సర్ఫరాజ్ పూర్తిగా వ్యతిరేకం. బృహత బెంగళూరు మహానగర పాలికెలో జాయింట్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్నా నిత్యం సైకిల్పై సవారీ చేస్తారు. ఆయన ఈ సైకిల్ సవారీ సరదా కోసమో, వ్యాయామం లో భాగంగానో కాదు. విధి నిర్వహణకు ఆయన సైకిల్పైనే వెళ్తుంటారు. ఆయన ఆఫీస్ కి వెళ్ళాలన్నా, వార్డుల తనిఖీకి వెళ్ళాలన్నా సైకిల్ నే వాడతారు. తద్వారా వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు. బెంగళూరులోని ఫ్రేజర్టౌన్ లో నివసించే సర్ఫరాజ్ఖాన్ బ్యాటరాయనపురలోని బీబీఎంపీ కార్యాలయానికి కూడా సైకిల్పైనే వెళ్తారు.
అక్కడి నుంచి వార్డుల వారీగా ఎటు వెళ్ళాలన్నా సైకిల్పైనే కదులుతారు. నిత్యం ఆయన దినచర్యలో సైకిల్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయనకు బీబీఎంపీ కారుతోపాటు కుటుంబ సభ్యులకు కార్లు ఉన్నా సైకిల్పై వెళ్ళడం తనకు సంతోషం అంటుంటారు. సైకిల్పై ఉదయాన్నే కార్యాలానికి చేరుకుని యలహంక చెరువు అభివృద్ధి పనులు పరిశీలించడమే కాక… స్థానికుల సమస్యలను ఆలకిస్తుంటారు. ఆయన చెరువు గట్టుపైకి చేరగానే జక్కూరు, పుట్టేనహళ్ళి, అల్లాలసంద్ర, యలహంకకు చెందిన చెరువుల అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ సంఘాల సభ్యులు వచ్చి సమస్యలు తెలియచేస్తుంటారు. వాటి పరిష్కారానికి అధికారులకు సర్ఫరాజ్ అప్పటికప్పుడే తగు సూచనలు చేస్తుంటారు. ప్రభుత్వ అధికారి ననగానే ప్రభుత్వ వాహనాల కోసం ఎగబడే కాలం లో సర్ఫరాజ్ చేస్తున్న పని ఆదర్శప్రాయంగా ఉంది కదా…