‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’.. ఇలా వరుస హిట్స్తో హ్యాట్రిక్ ఫీట్ను కెరీర్ ప్రారంభంలోనే సొంతం చేసుకున్న హీరో రాజ్ తరుణ్. ఈ మధ్యే విడుదలైన ‘కుమారి 21F’తో తన రేంజ్ పెంచుకున్న రాజ్ తరుణ్, అప్పుడే తన కొత్త సినిమా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ను కూడా విడుదలకు సిద్ధం చేసేశారు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టిలు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ను ఈ సాయంత్రం హైద్రాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో విడుదల చేశారు. హీరో సునీల్, ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్, మారుతి తదితరులు అతిథులుగా విచ్చేసి సినిమా యూనిట్కు శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్ను విడుదల చేశారు.
ఇక ఈ టీజర్తో రాజ్ తరుణ్ మళ్ళీ తన ఉయ్యాల జంపాల ఫ్లేవర్ను తీసుకొచ్చారనే చెప్పాలి. ఓ క్యూట్ లవ్స్టోరీగా సినిమా ఉండనుందని టీజర్ చెప్పకనే చెబుతోంది. ఇక రాజ్ తరుణ్ చెప్పిన “నాది నెట్ ఉన్నప్పుడు కనెక్ట్ అయిపోయి, లేనప్పుడు డిస్కనెక్ట్ అయిపోయే యూత్ లవ్స్టోరీ కాదురా, చిన్నప్పటి స్వీట్ లవ్స్టోరీ” అన్న డైలాగ్ సినిమా ఎలా ఉండబోతోందో పరిచయం చేస్తూ ఆకట్టుకునేలా ఉంది. రాజ్ తరుణ్ సరసన అర్తనా హీరోయిన్గా నటించిన ఈ సినిమాను జనవరి నెలాఖర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.