ఇప్పుడు రాష్ట్రం లో ఎక్కడ చూసిన కఠిక కరువు బాధలు చూడలేక కన్నీళ్ళు కారుస్తున్నారు జనం. కొందరు కరువును తట్టుకోలేక మూటా ముల్లె సర్థుకొని పిల్లా జెల్లలతో సహా ఉపాధిని వెతుక్కుంటూ ఇతర ప్రాంతలకు వలస వెళ్తున్నారు. కొందరు పుట్టిన ఊరును, పెరిగిన ప్రాంతాన్ని వదిలి పోలేక అష్ట కస్టాలు పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్నో కోట్లు విడుదల చేస్తున్నా అవి పేదవారికి చేరటం లేదు అనడానికి నిజామాబాద్ జిల్లాలోని లింగంపేట్ మండలంలోని పర్మళ్ల గ్రామపంచాయితీ పరిధిలోని ఆగపల్లి గ్రామం సాక్షం. ఎందుకంటే, ఒక్కప్పుడు ఈ ఊరిలో యాభై కుటుంబాలు ఉండేవి. వాళ్ళంతా పూర్తిగా వ్యవసాయంపైనే ఆధార పడేవారు. కానీ, గత రెండేళ్లుగా వర్షాల్లేక తాగునీరు కూడా దొరక్కపోవడంతో పక్క మండలాలకు, జిల్లా కేంద్రానికి వలస బాట పట్టడంతో ఇప్పుడూ ఆ గ్రామంలో పల్తానీ పాషా అనే వ్యక్తి మాత్రమే మిగిలాడు.
ఈ గ్రామం నిజాం రాజుల కాలంలో ఏర్పడింది అని చెపుతున్నారు. ఆ కాలంలో నిజాం వారి సైన్యం సేద తీరడానికి ఇక్కడికి వస్తుండే వారు. వాటికి సాక్షాలుగా ఉన్న నాటి భవనాలు ఇపుడు శిధిలావస్థకు చేరాయి. ఈ గ్రామంలో పాషా ఒక్కడే ఉండడంతో అతను ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో కూడా తనకే తెలియని పరిస్థితి. ఒక్కపుడు గ్రామం జనంతో సందడిగా కనిపించే ఆ గ్రామం ఇప్పుడు శిథిలాలకు సాక్షంగా మిగిలిపోనున్నది.