కొన్ని సార్లు మనం నమ్మలేనంత ఆశ్చర్యం కలిగించే నిజాలు తెలుస్తూంటాయి. కొన్ని నిమిషాల్లోనే మనిషిని మట్టు బెట్టగల పాము విషం ఎన్నో ఏళ్ళుగా మానవాళికి పెను భూతంగా మారిన హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ని మట్టు బెట్టి హెచ్ ఐ వీ ఎయిడ్స్ బారిన పడి కుమిలి పోతున్న వారికి ఊరట నివ్వనుంది.
ప్రాణాలు తీసే పాము విషమే.. ఆ ప్రాణాంతక వ్యాధికి మందు కానుంది! అద్భుతమైన ఈ ప్రయోగం జరుగుతున్నది ఎక్కడో విదేశాల్లో కాదు.. మన దేశంలోనే, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో జరుగుతోంది! పాము విషంతో చేసిన ఈ ఔషధం బాగా పనిచేస్తోందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ ధ్రువీకరించింది. రాష్ట్రంలోని ఆయుష్ విభాగం వద్ద బ్రెజిలియన జాతికి చెందిన ఒక రకం పాము విషంతో చేసిన ఒక ఔషధం ఉంది. కామెర్ల వంటి పలు రోగాల నియంత్రణకు ఆ ఔషధాన్ని చాలాకాలంగానే వినియోగిస్తున్నారు. ఈ ఔషధం ఎబోలా వైరస్ కు పనిచేస్తుందా? లేదా? అనే విషయాన్ని పరీక్షించి చెప్పాల్సిందిగా ఐఐసీటీని ఆయుష్ అధికారులు కోరారు. అయితే ఎబోలా వైరస్ కు సంబంధించిన పూర్తి సాంకేతిక సమాచారం తమ వద్ద లేదంటూ.. దానికి దగ్గర పోలికలు ఉండే హెచఐవీపై ఈ ప్రయోగ పరీక్షలను నిర్వహించడానికి ఐఐసిటీ ముందుకు వచ్చింది. దాంతో ఆయుష్ సంస్థ పాము విషం ఔషధాన్ని పంపింది. ఐఐసీటీ ఆ మందుతో హెచ్ఐవీపై పరీక్షలు నిర్వహించింది. అది ఆ వైర్స్ పై ప్రభావవంతంగా పనిచేస్తోందని పరీక్షల్లో తేలడంతో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
6 నెలలుగా హైదరాబాద్ రామంతపూర్లోని హోమియో ఆసుపత్రిలో సుమారు 3 వేల మంది ఎయిడ్స్ బాధితులపై క్లినికల్ ట్రయల్ను నిర్వహిస్తున్నారు. ఔషధాన్ని తీసుకుంటున్న వారికి ప్రతీ వారం ఎయిడ్స్ పరీక్షలను జరిపి సీడీ-4 సెల్స్ కౌంట్ ఆధారంగా ఔషధం మోతాదును నిర్ధారిస్తున్నారు. డాక్టర్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్లినికల్ పరీక్షల్లో.. మందు వాడుతున్న వారిలో సీడీ-4 (రోగనిరోధక శక్తిని పెంచే) సెల్స్ కౌంట్ పెరుగుతున్నట్టు గుర్తించారు. అంతే కాదు.. వీరిలో సుమారు 10 మందిలో హెచ్ఐవీ వైరస్ లోడ్ జీరో అయినట్టు పరీక్షల్లో తేలింది. దీంతో, ఈ పరీక్షల ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని తమకు అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ ఎయిడ్స్ నియంత్రణ బోర్డు కోరినట్టు ఆయూష్ కమిషనర్ రాజేందర్రెడ్డి ఒక ప్రముఖ దిన పత్రికకు చెప్పారు.
ప్రస్తుతం ఎయిడ్స్ రోగులకు అందిస్తున్న ఈ ఔషధం ఖరీదు చాలా తక్కువ. ఒక్కో డోస్ సుమారు 50 పైసల నుంచి ఒక్క రూపాయిలోపుగానే ఉంటోంది. పేద రోగులకు ఈ ఔషధం ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం జరుగుతున్న క్లినికల్ ప్రయోగాలపై మరింత స్పష్టత వచ్చిన తర్వాత ఈ మందు వాడకంపై మెడికల్ బోర్డు పరిధిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.