పుట్టిన దేశం లో నిలువ నీడ లేక పొట్ట చేత్తో పట్టుకొని భారత దేశం వచ్చాడతను. అయితే దేవుడే కాదు కదా.. సాటిమనిషి కూడా కనికరం చూపలేదు.అప్పటికే తన జీవితంతో పోరాడీ పోరాడీ అలసిపోయాడు. ఇకతన వల్ల కాలేదు పేదవాడు కదా.. కనీసం తన కోపాన్ని ఎవరి మీదా చూపించలేడు.అందుకే తన ప్రాణం తానే తీసుకున్నాడు. దేశం కాని దేశం లో తనకు జరిగిన అవమానాన్నీ,గుప్పెడు మెతుకులకోసం కాళ్ళు పట్టుకోవాల్సిన నిస్సహాయతని తట్టుకోలేని అతను హై టెన్షన్ వైర్లని పట్టుకున్నాడు…
శ్రీలంక శరణార్థిగా తమిళనాడులోని మదురైకి వచ్చిన వారికోసం అక్కడ శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్న కుటుంబాల్లో రవీంద్రన్ మరియు అతడి కుటుంబంకూడా ఒకటి.అయితే కుమారుడికి ఆరోగ్యం బాలేకపోవడంతో రవీంద్రన్ అతనిని హాస్పిటల్ లో చేర్పించాడు. కాగా ఇదే సమయంలో శరణార్థి శిబిరంలో ఆహార భద్రతా ఏర్పాట్లు చూసుకునే రెవెన్యూ అధికారి రావడంతో, తన కుమారుడిని గైర్హాజరుగా చేయవద్దని, అలా చేస్తే తనబిడ్డకు అన్నం దొరకదని, ఆసుపత్రిలో ఉన్నాడని బ్రతిమిలాడాడు. ఆసుపత్రిలో ఉన్న రశీదును చూపించాడు, కాని ఆ అధికారి మనసు మారలేదు. రవీంద్రన్ ఎంత చెప్పినా వినిపించుకోని, రెవెన్యూ అధికారి అతడి కుమారుడికి గైర్హాజరుగా వేశాడు.దానికి పెద్ద కారణం ఏమీ లేదు.కేవలం కోపం కారణంగానే అతనా పని చేసాడు.
ఎంత బ్రతిమిలాడుకున్నా ఆ అధికారి వినకపోగా, కరెంట్ స్థంభం ఎక్కి దూకి చావండి. ఇక్కడికొచ్చి మాప్రాణాలు తీసే బదులు నువ్వే చావు అంటూ గట్టిగా తోస్తూ మాట్లాడాడు. అప్పటికే మనస్థాపం చెందిన రవీంద్రన్ ఎదురుగా ఉన్న కరెంట్ స్థంభం ఎక్కి, హైటెన్షన్ వైరును కాలుతో అందుకున్నాడు. అందరూ చూస్తుండగానే రవీంద్రన్ ప్రాణాలు కోల్పోయాడు.
ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు కోపాన్ని ఆపుకోలేక పోయారు, ఆ రెవెన్యూ అధికారిని చితక్కొట్టారు. పోలీసులకు సమాచారం తెలియడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని రవీంద్రన్ మృతికి కారణం అయిన అధికారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పొట్టకూటి కోసం శరణార్తిగా వచ్చిన రవీంద్రన్ కుటుంబాన్ని కేవలం తన ఇగో సంతృప్తి కోసం అనాథలుగా చేశాడు ఆ రెవెన్యూ అధికారి.