Home / Inspiring Stories / ఒకప్పుడు నెలకు 4రూపాయలకే జీతం చేసిన వ్యక్తి… నేడు దేశవిదేశాల్లో 22రెస్టారెంట్లకు యజమాని.

ఒకప్పుడు నెలకు 4రూపాయలకే జీతం చేసిన వ్యక్తి… నేడు దేశవిదేశాల్లో 22రెస్టారెంట్లకు యజమాని.

Author:

పేరు సురేష్ పూజారి, అది 1950వ సంవత్సరం అతని వయసు అప్పుడు పదేళ్లు. తన సొంతూరు కర్నాటకలోని ఉడిపి జిల్లాలోని పదుకోన్. అతడు కొన్ని కారణాల వల్ల పొట్టచేత పట్టుకుని మంబై వెళ్లిపోయాడు. ఓ గుడి దగ్గరున్న బడ్డీ కొట్టులో పనికి కుదిరాడు. తన మొదటి జీతం నెలకు 4 రూపాయలు. కొంతకాలం తర్వాత ముంబై పోర్ట్ ట్రస్ట్ క్యాంటీన్‌కు వెళ్లాడు. అక్కడ ఇంకో రెండు రూపాయలు ఎక్కువిస్తానన్నారు.చూస్తుండగానే కాలం గడిచిపోతుంది. ఎంతకాలం ఒకరి దగ్గర పనిచేయాలి అనే ఆలోచన అతని మనసులో తట్టింది. తెలిసిన వ్యక్తి దగ్గర కొంత అప్పు చేశాడు. తాను దాచుకున్న డబ్బులు కూడా కలిపాడు. ఒక ఫ్రూట్ జ్యూస్ సెంటర్ మొదలుపెట్టాడు. దాంతోపాటు పావ్ బజ్జీ మొదలుపెట్టాడు. చౌపట్టీ ఏరియాలో ఒక చిన్న తోపుడు బండిలో అంతా ఏర్పాటు చేసుకున్నాడు.

suresh poojari sukh sagar

చాలా తక్కువ కాలంలోనే జ్యూస్ సెంటర్ విజయవంతం అయింది. మరో ఆలోచన లేకుండా లామింగ్టన్ రోడ్డులో రెండో ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశాడు. ఈసారి శాండ్విచ్‌, ఇడ్లీ, ఫ్రైడ్ రైస్ జత కలిశాయి. సుఖ్‌ సాగర్ పేరుతో ఏర్పాటు చేసిన రెండు సెంటర్లు అదృష్టం కొద్దీ బాగా పాపులర్ అయ్యాయి.

ఎన్నో ఒడిదొడుకులు.. మరెన్నో ఆటుపోట్లు, కష్టాల తర్వాత సుఖాలన్నట్టు.. ఒక విజయం తర్వాత మరో విజయం. అలా మొత్తం బ్రాంచీలు 22 అయ్యాయి. అందులో 8 ముంబైలో, 7 బెంగళూరులో, ఒకటి మైసూరులో, మరొకటి చెన్నైలో ఉన్నాయి. విదేశాలైన సౌదీ, దుబాయ్, ఖతార్‌ లలో సైతం సుఖ్ సాగర్ బ్రాంచీలున్నాయి. 22 హోటళ్లతో పాటు ఒక షాపింగ్ మాల్, ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ, దాంతోపాటు బెంగళూరులో ఒక త్రీస్టార్ హోటల్ ఉంది.

సాదాసీదాగా తోపుడు బండిలో మొదలైన బజ్జీల వ్యాపారం నేడు దేశవిదేశాల్లో స్టార్ హోటళ్లుగా మారిందంటే కారణం అతనిలో ఉన్న కసి, పట్టుదల. సురేష్ పూజారి విజయగాథ విని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా వచ్చి అతనికి షేక్ హ్యాండిచ్చారు. ఇక మాజీ కేంద్రం మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ అయితే అప్పట్లో సుఖ్ సాగర్ కు రెగ్యులర్ కస్టమర్.

కస్టమర్ల టేస్ట్ ఏంటో, వాళ్ల అభిరుచి ఏంటో తెలసుకోగలిగాను కాబట్టే హోటల్ బిజినెస్ లో సక్సెస్ కాగలిగాను అని సురేష్ పూజారి చెప్తుంటాడు. అదే తన రియల్ లెర్నింగ్ గ్రౌండ్ అంటాడు. రోజుకి తప్పకుండా 18 గంటలు పనిచేసేవాడు. అలా కష్టపడుతూనే రాత్రిపూట బడిలో చేరాడు. తొమ్మిదో తరగతి దాకా ఎలాగో నెట్టుకొచ్చాడు. కానీ పడవ తరగతికి వచ్చే వరకు కష్టమైంది. అలా చదువుకి ఫుల్ స్టాప్ పడింది. కానీ ఇప్పటికీ పుస్తక పఠనం అతని అలవాటు. ఆ అభిరుచితోనే వెయ్యిదాకా పుస్తకాలు కలెక్ట్ చేశాడు. అందులో ఏ ఒక్కటీ చదవకుండా వదల్లేదట.వ్యాపారం ఒక్కటే కాదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అనాథలకు అభాగ్యులకు చదువు, కడుపునిండా అన్నం పెడుతున్నాడు. సుమారు వెయ్యిమందికి తన సంస్థల్లో ఉపాధి కల్పించాడు.

1976లో వివాహం చేసుకున్నాడు. ఇతడికి ముగ్గురు కుమారులు. వాళ్లంతా ఇండియాతో పాటు విదేశాల్లో ఉన్న సుఖ్ సాగర్ రెస్టారెంట్ల ఆపరేషన్స్ చూసుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అలవర్చుకున్న సురేష్ పూజారి, తన సొంత ఊరిని ఏమాత్రం మరిచిపోలేదు. పదుకోన్ గ్రామంలో ఎందరో పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. ఆ ఊరిలో ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టిచ్చాడు.

ఇంకో విషయం ఏంటంటే.. తన స్టాఫ్ లో ఎవరికైనా ఒంట్లో బాగాలేక సెలవు పెడితే, పెయిడ్ లీవ్ ఇస్తాడు. అది కాకుండా వారి మెడికల్ బిల్లు కూడా తనే చెల్లించి పెద్దమనసు చాటుకుంటాడు. సిబ్బందిలో ఎవరికైనా రుణం కావల్సి వస్తే కాదనడు. సొంతంగా బిజినెస్ పెట్టుకుంటానంటే భుజంతట్టి ప్రొత్సహిస్తాడు. ఇలాంటి మనిషిని ఆదర్శంగా తీసుకుంటే జీవితంతో ఎలాంటి పనిలో అయినా విజయం సాధించవచ్చు.

MustRead: ఒకప్పుడు మెకానిక్… ఇప్పుడు దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో 22 ఫ్లాట్లకు ఓనర్.

(Visited 1,403 times, 1 visits today)