అతనొక అద్బుతమైన క్రికెటర్ భారత దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు దేశవాళీ మ్యాచుల్లోనూ తన జట్టు ని లెక్కలేనన్ని క్రికెట్ మ్యాచ్ లను తన ఒంటిచేత్తో గెలిపించాడు. అంతే కాదు మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ తో 2006లో వరల్డ్ కప్ ఫైనల్స్లో ఓడిపోయినా కూడా టోర్నమెంట్ బెస్ట్ బ్యాట్స్మెన్గా, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. 2010లో భారత క్రికెట్ టీం కి కెప్టెన్గా సెలెక్ట్ అయిన శేఖర్. రెండేళ్ల తర్వాత భారత దేశానికి మొట్టమొదటి టీ-20 వరల్డ్ కప్ నీ అందించాడు. ఇంగ్లండ్తో ఆడిన ఆ టీ-20 ఫైనల్ మ్యాచ్లో 58 బాల్స్లో 134 రన్స్ చేసి. ఇండియాను ఛాంపియన్ గా నిలిపాడు. అయితే ఏ పత్రికా, మరే టీవీ చానెల్ అతన్ని గుర్తించలేదు. అతనిపై ప్రత్యేక కథనాలు కాదు కదా కనీసం చిన్న న్యూస్ గా కూడా అతని ప్రతిభని గుర్తిస్తూ రాయలేదు. ఏ కంపెనీ అతన్ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకోలేదు. కారణం ఒక్కటే శేఖర్ అందుడు. భారత దేశ అంతర్జాతీయ అంధుల క్రికెట్ టీం కెప్టెన్….
మనదేశంలో క్రికెట్ ఒక మతం…. సచిన్ క్రికెట్ దేవుడు…కానీ అదే శరీరక లోపం ఉన్న క్రీడాకారులకు ఈ దేశం లో విలువ, గుర్తింపూ రెండూ ఉండవు అనటానికి శేఖర్ ఒక చేదు సాక్ష్యం. అంధుల క్రికెట్కు ప్రజల్లో ఆదరణ లేకపోవచ్చుగానీ, ఆటలో రికార్డుల పరంగా అతను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఏమాత్రం తీసిపోడు. ఎవరూ గుర్తించకున్నా ఇతర ఆటగాళ్ళ మాదిరిగా కోట్ల రూపాయలు ఆర్జించకున్నా అతను ఆడుతూనే ఉన్నాడు. ఇవేగాక ఎన్నో అంతర్జాతీయ మ్యాచుల్లో భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఘనత శేఖర్ది. ఈ స్ధాయికి చేరుకోవడం అంత ఈజీ కాలేదంటాడు శేఖర్. క్రికెట్ని ఒక మతంలా కొలిచే మన దేశంలో అంధుల క్రికెట్కు మాత్రం ఆదరణ లేకపోవడమే ఇందుకు కారణం.
శేఖర్ నాయక్ ఊరు కర్నాకటలోని షిమోగా. చిన్నతనంలోనే క్రికెట్ అంటే ఆసక్తి . తాను లోకాన్ని చూడలేకపోయినా, అది ఏ మాత్రం అడ్డుకాదని అనుకున్నాడు. కళ్ళ ముందు అంతా చీకటే…, బాల్ కనిపించడు, బౌలర్ అంతకన్నా కనిపించడు అంతా తన మెదడు మీదే ఆధార పడి ఆడాల్సిన ఆట పంచేంద్రియాలనీ కేంద్రీకరించి ఆడాల్సిన ఆట. పట్టుదలతో కోచింగ్ తీసుకున్నాడు. 2000వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తన సత్తా ఏంటో ప్రపపంచానికి చూపించాడు. 46 బాల్స్లో 136 రన్స్ కొట్టి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ రికార్డుతో శేఖర్ దశ తిరిగిపోయింది. కర్నాటక అంధుల క్రికెట్ టీంలో చోటు దక్కింది. ఫైనల్ మ్యాచ్లో కర్నాటక తరఫున ఆడి 249 పరుగులు సాధించి తన జట్టును దగ్గరుండి గెలిపించాడు. కానీ అతని ఆర్థిక పరిస్థితి రంజీల్లో ఆడే చిన్న స్థాయి క్రీడాకారుడికన్నా ధారుణం. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన శేఖర్ కర్ణాటక లోని “సమర్ధానం బ్లైండ్ ట్రస్ట్లో” రూప అని తనలాంటి అమ్మాయిని ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. వాళ్లకు ఇప్పుడు ఒక పాప కూడా ఉంది.
మనందరం ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్న కేప్టెన్ ధోనీ మాదిరిగానే తన సారథ్యంలో 2012లో టీ20 ప్రపంచకప్, ఒక వన్డే ప్రపంచ కప్ ను అందించిన 29 ఏళ్ల శేఖర్. ప్రస్తుతం జీవనోపాధి కోసం అర్రులు చాస్తున్నాడు. ఓవైపు తిరుగులేని బ్రాండ్ వాల్యూతో ధోనీ, సచిన్, ఆట నుంచి రిటైర్ అయిన ఆటగాళ్ళు సైతం ఏటా వందల కోట్లు సంపాదిస్తుంటే, శేఖర్ మాత్రం ఇల్లు గడవడానికి రూ. 15 వేల జీతానికి ఓ ఎన్జీవోలో పనిచేస్తున్నాడు. ఇదీ మనదేశం లోనే కాదు ప్రపంచం లోని అన్ని ప్రాంతాల, అన్ని దేశాల ఫిజికల్లీ చాలెంజ్డ్ ఆటగాళ్ళ పరిస్థితి…. నిజంగానే మనలో స్పోర్టింగ్ స్పిరిట్ ఉందా? మనం నిజమైన క్రీడాభిమానులమేనా???