బ్రిటిష్ వారి చేతిలో మన దేశం బందీగా ఉన్నప్పుడు వారి అరాచకాలకు ఎదురు తిరిగి, వారికి కంటిమీద కునుకులేకుండా చేసిన భరతమాత బిడ్డలు ఎందరో ఉన్నారు… అలాంటి వారిలో ఒకడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. అతడే ఒక సైన్యంగా… పోరాడి ఎంతోమందిని తన సైన్యంలో చేర్చుకొని ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేస్తే అతని మీద పగను పెంచుకున్నారు బ్రిటిష్ వారు. నరసింహా చేస్తున్న తిరుబాట్లకు ఎదురుకోలేక అతని కుటుంబాన్ని బంధించి చిత్రహిసంలు పెట్టి చివరికి అతడు ఉండే స్థావరాన్ని కనిపెట్టి, దొంగ దెబ్బతీసి అందరి సమక్షంలో 1847 లో తలను,శరీరాన్ని వేరుచేసి, కోయిలకుంట్ల కోటలోని ఉరికొయ్యకు తలను వ్రేలాడదీశారు. అలా అతని తల 1877 వరకు అంటే 30 సంవత్సరాలు అలాగే వేలాడదీశారు.
30 ఏళ్ళు వేలాడిన నరసింహా రెడ్డి తల వెనుక కథ :
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి …. రాయలసీమలోని ప్రజలను సొంత మనుషులుగా చూసుకుంటూ పాలిస్తున్న స్థానిక నాయకులుగా వ్యవహరించే పాళెగాండ్లలో ఒకడు. 18వ శతాబ్దంలో నిజాం నవాబ్ ఆదీనంలో ఉన్న రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది. ఈ విధానంతో పాలెగాళ్ళు అందరూ బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చారు. రోజు రోజుకు బ్రిటిష్ వారు పాలెగాళ్ళ ఆస్తులపై, మాన్యాలపై దృష్టిపెట్టి వాటిని ఎలాగైనా ఆక్రమించుకోవాలి అనే ఉద్దేశ్యంతో వారికి ఉన్న అధికారాలను రోజు రోజుకు కొంత తగ్గిస్తూ వచ్చారు. అలా కొన్ని రోజుల తరువాత పాలెగాళ్ళ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి వారికి నెలవారీ భరణాలను ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. పాలెగాళ్ళ విధానం రద్దు చేయడంతో ప్రజలను చూసుకునే దిక్కులేక ప్రజలకు కష్టాలు మొదలైనవి. ఇది గమనించినా నరసింహా రెడ్డికి బ్రిటిష్ పాలకులంటే అసహ్యం వేసింది. ఒక రోజు తన నెలసరి భరణం కోసం తన అనుచరుణ్ణి 1846 జూన్ లో కోయిలకుంట్ల ఖజానాకు పంపించాడు నరసింహా రెడ్డి. ఖజానా తాసిల్దార్, నరసింహా రెడ్డి అనుచరుణ్ణి తిట్టి అతడు వస్తే ఇస్తాను అనడంతో అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వంపై కోపంతో ఉన్న నరసింహా రెడ్డి ఈ విషయంతో ఒక్కసారిగా తిరుగుబాటు చేశాడు. బ్రిటిష్ పాలనకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరిని ఒక్కటిగా చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసిన సైన్యానికి కొద్దీ రోజులు శిక్షణ ఇచ్చి వారికి పోరాట పటిమలు నేర్పాడు.
1846 జులై 19 వ తేదీన నరసింహా రెడ్డి తన 500 మంది సొంత సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడి చేసి, అక్కడున్న సిబ్బందిని చంపి, ఖజానాలో ఉన్న 805 రూపాయలు తీసుకెళ్తాడు. ఈ దాడి విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం నరసింహా రెడ్డిని పట్టుకోవటానికి బ్రిటిష్ సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఎంత వెతికిన దొరక్కపోవడంతో అతని ఆచూకీ చెప్పినా, పట్టి ఇచ్చిన వారికి వేయి రూపాయల బహుమతి ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. అలా చేసినా కూడా అతని ఆచూకీ తెలియకపోవడంతో అతని కుటుంబాన్ని బంధించి చిత్రహింసలు పెట్టారు. 1846 లో అక్టోబర్ 6 న నల్లమల కొండల్లోని జగన్నాధాలయంలో ఉన్నాడని వార్త తెలుసుకున్న అప్పటి కడప కలెక్టర్ కాక్రేన్ తన సైన్యంతో ఆ ఆలయాన్ని చుట్టుముట్టి చివరికి అతి కష్టం మీద నరసింహా రెడ్డిని బంధించారు. 1847 ఫిబ్రవరి 22 న ఉదయం 7 గంటలకు ఉయ్యేలవాడ నరసింహరెడ్డిని తాను చేసిన ప్రభుత్త్వ వ్యతిరేక పనులకుగాను బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం… ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా, ఎలాంటి పనులు చేసిన ముఖ్యంగా విప్లవ కారులను భయపెట్టాలన్న ఉద్దేశ్యంతో నరసింహారెడ్డి తలను 30 ఏళ్ళు కోయిలకుంట్ల కోటాలోని ఉరికొయ్యకు వ్రేలాడ తీసి ఉంచారు.
ఉయ్యాలవాడ మరణించి ఉండొచ్చు కానీ అక్కడి ప్రజల గుండెల్లో, అక్కడ ప్రజలు పాడుకునే వీరగాథల్లో తాను ఎప్పుడు బ్రతికే ఉంటాడు. ఉయ్యాలవాడ ప్రజలకు అందించిన పోరాటం మరణం లేనిది…. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆ విప్లవయోధుడు భారతీయుల సత్తా ఎలా ఉంటుందో బ్రిటీష్ వారికి చూపించిన దైర్యశీలి….