ప్రపంచ న్యాయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక అనూహ్య పరిణామం మన దేశ న్యాయ వ్యవస్థలో చోటు చేసుకుంది, చరిత్రలోనే తొలిసారిగా సుప్రీం కోర్టు న్యాముర్తులు జస్టిస్ చలమేశ్వర్ రావు, జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్,జస్టిస్ మదన్ బి లోకూర్ లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు, వీరు భారత ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టులో పాలన సరిగా లేదని, కొన్ని నెలలుగా సుప్రీంకోర్టులో ఎన్నో జరగకూడని సంఘటనలు జరిగిపోయాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు, ఇదే విషయాన్ని తాము ప్రధాన న్యాయమూర్తికి చెప్పిన ఆయన వినిపించుకోలేదని అన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా తొలిసారి మీడియాతో మాట్లాడాల్సి వస్తున్నదని స్పష్టంచేశారు.
జస్టిస్ చలమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘దేశంలోనే కాదు.. ప్రపంచ న్యాయ చరిత్రలోనే బహుశా ఇలాంటి ఘట్టం చోటు చేసుకోలేదేమో, సుప్రీం కోర్టులో పరిపాలన విధానం సరిగ్గా లేదు. జరగకూడని పరిణమాలు చోటు చేసుకున్నాయి. మీడియాలో వస్తున్నట్లు ఇవేం రాజకీయ అంశాలు కావు. న్యాయ వ్యవస్థలో స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. సుప్రీంకోర్టు గౌరవాన్ని పరిరక్షించాలని.. ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దామని ప్రధాన న్యాయమూర్తికి(లేఖ ద్వారా) విజ్ఞప్తి చేశాం. కానీ, ఆయన నుంచి సానుకూల స్పందన లభించలేదు. అందుకే లోపాలను సరిదిద్దాలని మేం నలుగురం భావించాం. జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించేందుకు ముందుకు వచ్చాం. చీఫ్ జస్టిస్ ను అభిశంసించాలా లేదా అన్నది దేశం తేల్చుకోవాలి.
అయితే ఏం జరిగింది? అన్న మీడియా ప్రశ్నకు వారి నుంచి స్పష్టమైన సమాధానం అందలేదు. పూర్తి వివరాలను లేఖ రూపంలో వాళ్లు మీడియాకు విడుదల చేశారు. తమ ముందు మరో అవకాశం లేకుండా పోవటంతోనే ప్రజల ముందుకు వచ్చామని మరో న్యాయమూర్తి లోకూర్ తెలిపారు. ఇక గత డిసెంబర్ లో ఓ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా-జస్టిస్ చలమేశ్వర్ల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏకపక్షంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయాలు తీసుకుంటున్నారని జస్టిస్ చలమేశ్వర్ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.