దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపిన ‘బురారీ సామూహిక ఆత్మహత్యల’ కేసు వెనక తాంత్రిక కోణం బయటపడింది. ఆ ఇంటి పెద్ద లలిత్ భాటియా దగ్గర కాంట్రాక్టర్ గా పనిచేసే వ్యక్తి కుమార్తె గీత అనే తాంత్రికురాలు చెబితేనే.. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఓ వార్తా చానల్ స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడించింది. ఆత్మహత్యల తర్వాత వారి ఆత్మలు మోక్షాన్ని పొందడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నట్లు భావిస్తున్న 11 పైపులను అమర్చింది కూడా గీత తండ్రి కావడం గమనార్హం. ‘వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించింది నేనే. త్వరలో నేను వారిని కలుసుకోబోతున్నా’ అని సదరు వార్తా చానల్ ప్రతినిధులతో గీత వ్యాఖ్యానించింది.
ఈ స్టింగ్ ఆపరేషన్ కలకలంతో రంగంలోకి దిగిన క్రైమ్స్ డీసీపీ జోయ్టిర్కే నేతృత్వంలోని బృందం గీతను ప్రశ్నించింది. సుదీర్ఘ విచారణ తర్వాత డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. తాంత్రిక కోణాన్ని కొట్టివేశారు. అటు గీత తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కుమార్తె చెబితేనే భాటియా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందనడంలో నిజం లేదు. ముగ్గురు పిల్లల తల్లి అయిన గీత (35) చేతుల్లో మహత్యముంది. తన వద్ద వచ్చే రోగులను తాకి.. వారి వ్యాధులను నయం చేస్తుంది. ఆమెకు తాంత్రిక విద్యలేవీ రావు’ అని వివరించారు. వారి ఆత్మహత్యలకి గల కారణాలు ఇంకా మిస్టరీగానే ఉందని తెలిపారు.