వచ్చే నెలలో జరగనున్న వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో తాను పోటి చేయడానికి బ్యాంకు లోన్ ఇవ్వాలని శుక్రవారం నల్లకుంట లోని కెనర బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ని కలిసి తన సమస్య విన్నవించి ఒక వినతి పత్రం ఇచ్చారు. బాగ్ అంబర్ పేట్ లో అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న K .వెంకట నారాయణ అనే యువకుడు సామాజిక ఉద్యమ కారుడిగా పలు ప్రజా సమస్యలపై తన వంతు ఉద్యమాలు చేస్తూ ఆవినీతి అక్రమాలపై పోరాటం కొనసాగించాడు. 2014 లో జరిగిన ఎన్నికలలో అంబర్ పేట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి గా పోటి చేసాడు. ఇప్పుడు వరంగల్ లోక్ సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో పోటి చేస్తున్నాడు. ఉప ఎన్నికలలో పోటి చేయడానికి తనకు లోన్ ఇవ్వాలని బ్యాంకు మేనేజర్ కి విన్నవించడం అందరిని నివ్వెర పరిచింది.ఎన్నికలలో పోటి చేయడానికి తన ఖర్చులకి, కర పత్రాల ముద్రణకి మరియు ప్రచారం కొరకు తాను బ్యాంకు లోన్ ఇవ్వాలని వెంకట నారాయణ పేర్కొన్నాడు.
ప్రస్తుతం జన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానని, 2014 ఎన్నికలలో అంబర్ పేట్ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి గా పోటి చేసినప్పుడు కూడా బ్యాంకు లోన్ అడిగానని కానీ లోన్ ఇవ్వలేదని ఇప్పుడైన ఇవ్వాలని కోరుతున్నానని వెంకట నారాయణ పేర్కొన్నాడు. సామాజిక ఉద్యమకారులకి బ్యాంకులు అండగా ఉండాలని అప్పుడే రాజకీయాలలో సామాన్యులకు సైతం చైతన్యం వస్తుంది అని అన్నారు.ఇలా స్వతంత్రగా పోటి చేస్తున్న అభ్యర్థులకు బ్యాంకు లోన్ జారీ చేసేటట్టు పార్లమెంట్ లో ఒక బిల్ ప్రవేశ పెట్టాలని ప్రధాన మంత్రి ఐన నరేంద్ర మోడీకి లెటర్ రాశానని తెలిపారు.