కేంద్ర ప్రభుత్వం మరోసారి నోట్ల రద్దు నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది, గత సంవత్సరం నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తరువాత చెలామణిలోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోట్లని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలనుకుంటుందా..? దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పాలంటూ రాజ్యసభలో విపక్ష సంభ్యులు డిమాండ్ చేసారు, కానీ అరుణ్ జైట్లీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
రాజ్యసభ జీరో అవర్ లో సమాజ్వాద్ పార్టీకి చెందిన ఎంపీ నరేశ్ అగర్వాల్ ఈ అంశంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ‘రూ.2వేల నోటును ప్రభుత్వం రద్దు చేయాలనుకుంటోందని అన్నారు. RBI ఇప్పటికే ఆ నోటు ప్రింటింగ్ ను ఆపివేయాలని సూచించిందని.. ఒకవేళ రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే సభలో ఆ విషయాన్ని తెలపాలని కోరారు. RBI 3.2 లక్షల కోట్ల రూ.2వేల నోట్లను ముద్రించిందని, ప్రస్తుతం ఈ నోట్ల ముద్రణను ఎందుకు నిలిపివేసిందో చెప్పాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు నరేశ్ అగర్వాల్. ఇప్పటికే ఒకసారి నోట్లను రద్దు చేశారని.. రెండోసారి కూడా అలాంటి ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందా అని ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. మొదటి సారి నోట్ల రద్దు అంశాన్ని RBI తిరస్కరించినప్పటికీ ప్రభుత్వం దాన్ని చేపట్టిందన్నారు. రెండోసారి కూడా ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకుంటుందా అని ప్రశ్నించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల నోట్ల ముద్రణ జరగలేదు. పూర్తి నిలిపివేసి.. కొత్తగా రూ.200 నోట్లను ఆగస్ట్ లో విడుదల చేస్తోంది. కొత్తగా చలామణిలోకి తీసుకురానున్న రూ.200 నోటుపై ఎక్కువ దృష్టిసారించింది. ఇప్పటికే మైసూర్ ప్రింటింగ్ ప్రెస్లో రూ.200 నోట్ల ముద్రణ జోరుగా సాగుతుంది. వీటికి నకిలీలు సృష్టించకుండా ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించనునున్నారు. రెండు వందల రూపాయల నోట్లు మార్కెట్ లోకి రాగానే.. రూ.2వేల నోట్లను రద్దు చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. నరేశ్ అగర్వాల్ లేవనెత్తిన అంశాలపై సభలోనే ఉన్న జైట్లీ సమాధానం ఇవ్వలేదు.
కేంద్రంలో కీలక శాఖలో పనిచేసే అధికారులు రూ.2 వేల నోటుని రద్దుచేసే విషయంలో నిర్ణయం తీసుకోలేదని, రూ.2 వేల నోట్లు రద్దు చేస్తే జరిగే పరిణామాలపై చర్చిస్తున్నామని కాకపోతే రూ.2 వేల నోట్లని రద్దు చేసే అవకాశాలు తక్కువ అని తెలిపారు.